హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయంగా రూ. 2 లక్షలు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు మే 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రం, అక్రిడేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధృవీకరించవలసి ఉంటుందన్నారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, హైదరాబాద్. చిరునామా : ఇంటి నెం 10-21, సమాచార భవన్, 2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్. ఇతర వివరాలకు 040-23298672/74 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైందని అల్లం నారాయణ తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతిలో కేవలం గత 10 రోజుల వ్యవధిలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతిచెందిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా కొత్తగా 200 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడిన వారికి కూడా నేటి నుంచి తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.