న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ దిశ కిడ్నాప్, రేప్, హత్య కేసులో నిందితులైన నలుగురు యువకులు ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ చేపడుతున్నది. అయితే ఆ కేసులో దర్యాప్తును పూర్తి చేసేందుకు ఆ కమిషన్కు సుప్రీం మరో ఆరు నెలల గడువును పెంచింది. 2019, డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ శివారు ప్రాంతంలో నలుగుర్ని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎన్కౌంటర్ విషయంలో దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని కమిషన్కు చెందిన లాయర్ కే పరమేశ్వర్ను సీజేఐ ప్రశ్నించారు. గత ఏడాది జూలైలో కూడా దర్యాప్తును పూర్తి చేసేందుకు ఆర్నెళ్ల ఎక్స్ టెన్షన్ కోరారు. జనవరిలోనూ మళ్లీ పొడిగింపు ఇచ్చారు.
కరోనా మహమ్మారి వల్ల విచారణ ఆలస్యం అవుతున్నట్లు లాయర్ పరమేశ్వర్ తెలిపారు. ఈ కేసులో కొత్తగా 130 మంది సాక్ష్యులు వచ్చినట్లు చెప్పారు. గ్యాంగ్స్టర్ వికాశ్ దూబే ఎన్కౌంటర్లో జస్టిస్ చౌహాన్ కమిషన్ విచారణ వేగంగా ముగిసిందని, మరి హైదరాబాద్ ఎన్కౌంటర్ అంశంలో ఎందుకు ఆలస్యం అవుతున్నట్లు సీజే అడిగారు. అత్యాచారం, మర్డర్ కేసులో నిందితులైన మహ్మద్ ఆరీఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ను క్రైం సీన్ వద్దకు తీసుకువెళ్లిన సమయంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. నిందితులు పోలీసుల వద్ద నుంచి గన్స్ తీసుకుని పారిపోతుంటే, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.