సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినోయ్ విశ్వం
హిమాయత్నగర్/ హైదరాబాద్, జనవరి 10 : మోదీ ప్రభుత్వం అజేయమైనదేమీ కాదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అఖిల భారత ఎల్ఐసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బినోయ్ విశ్వం అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు చేసిన మహోద్యమంలో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని చెప్పారు. ఆ ఉద్యమాన్ని కార్మికలోకం ఆదర్శంగా తీసుకొని ఫిబ్రవరి 23, 24 తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్లో సోమవారం ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నందున ఈ సారి బడ్జెట్లో మోదీ సర్కారు వరాలు ప్రకటించే అవకాశం ఉన్నదని, కార్మికవర్గం, ప్రజలు ఆ వలలో పడొద్దని సూచించారు. హిమాయత్నగర్లోని మఖ్ధుం భవన్లో జరిగిన సమావేశంలోనూ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగ నమ్ముతూ, కీలకమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నదని ఆరోపించారు.