CM KCR Press Meet : యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు తెరిస్తే కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు. ఇంత దిగజారిన, నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు.
భారతదేశంలో ఉండే పరిస్థితి ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం ఆహార సేకరణ చేస్తే.. రాష్ట్రాలు తమ బాధ్యతగా ధాన్యాన్ని సేకరించి వాటికి అప్పగిస్తాయి. ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా జరిగే తంతు. మరి ప్రధానంగా బియ్యం, గోధుమలనే సేకరిస్తారు. మేజర్ గా మన దేశంలో తినేది ఎక్కువగా అన్నం లేదంటే రొట్టె కాబట్టి.. ఎఫ్సీఐ వీటినే సేకరిస్తుంది.
వీటిలో పెద్ద రాద్దాంతం సృష్టించి.. గందరగోళం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా సులభమైన విషయం.. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి.. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఒక చిల్లర కొట్టు వ్యక్తిలా మాట్లాడకూడదు. కిరాణ షాపు వాళ్లలా మాట్లాడకూడదు. అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు. ఎలాగంటే ప్రతి విషయంలో నువ్వు లాభనష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడుతావా? అప్పుడు ప్రభుత్వం ఎలా అవుతుంది. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల్లో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
ఏ ప్రభుత్వం అయినా సరే.. ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది అది సోషల్ రెస్పాన్సిబిలిటీ.. దేశ ఆహార భద్రత కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో ఒకసారి నిల్వలు పెరిగితే దానికి ఆల్టర్నేట్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికే ఉంటుంది. ఆ ప్రాసెస్లో 30 వేల కోట్లో.. 40 వేల కోట్లో.. 50 వేల కోట్లో.. పోనీ లక్ష కోట్లో నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ.. మీరు నెపాలను చాలా దిక్కుమాలిన తనంగా ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేటువంటి దరిద్రపు ప్రయత్నం జరుగుతోంది. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదు. భవిష్యత్తులో చూస్తామని కూడా మేము అనుకోవడం లేదు. ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వం విధానాలను సీఎం కేసీఆర్ ఎండగట్టారు.