పటాన్చెరు, అక్టోబర్ 8: సాధారణంగా ఒక ఇంట్లో ఒకరికో లేదా ఇద్దరికో పింఛన్లు రావడం చూస్తుంటాం. కానీ, ఒకే కుటుంబంలో అర్హులైన ఐదుగురికి ఆసరా పింఛన్లు ఇస్తూ అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడా పింఛన్లే ఆ ఇంటికి పెద్ద ఆసరా అయ్యాయి. తల్లికి వితంతు పింఛన్, ముగ్గురు కొడుకులకు దివ్యాంగుల పింఛను, భర్త ఆదరణకు నోచకోక పుట్టింట్లోనే ఉంటున్న ఆడబిడ్డకు ఒంటరి మహిళ పింఛను అందిస్తూ మానవత్వం చాటుకొన్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో నివసిస్తున్న చంద్రకళ (73)కు ఇద్దరు కూతుర్లు, నలుగురు కొడుకులు. నలుగురు కొడుకుల్లో ముగ్గురు దివ్యాంగులు. సిద్ధప్ప (47), మహేశ్వర్ (45), రవికుమార్ (38) దివ్యాంగులు. కండర క్షీణత వ్యాధితో వారు తమ దినచర్యలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆమె కూతురు ఉమారాణి (50) తమ్ముళ్ల బాగోగులు చూస్తూ ఇక్కడే జీవిస్తున్నారు. వీరి కుటుంబ పరిస్థితి చూసిన అధికారులు చంద్రకళకు వితంతు పింఛన్ రూ. 2016, సిద్దప్ప, మహేశ్వర్, రవికుమార్కు దివ్యాంగుల పింఛన్ రూ.3016, ఉమారాణికి ఒంటరి మహిళ పింఛన్ రూ. 2016 వస్తున్నాయి. మొత్తంగా రూ. 13,080 వస్తున్నాయి. ఈ డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. సీఎం కేసీఆర్ ఇచ్చే పింఛన్లపైనే ఆ కుటుంబం మనుగడ సాగిస్తున్నది. తమ కుటుంబానికి అండగా ఉంటున్న తెలంగాణ సర్కారుకు చంద్రకళ కృతజ్ఞతలు తెలిపారు.