సంగారెడ్డి : రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటులేదని మరో సారి బీఆర్ఎస్ విజయం సాధించడ ఖాయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) అన్నారు. బుధవారం చౌటకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. సాగు,తాగు నీటి గోసి తీర్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రతి పక్షాల మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్, జైపాల్ రెడ్డి, భిక్షపతి, శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.