Palakurthi | ప్రకృతి రమణీయతతో సిరులు కురిపించే పాడిపంటలకు నెలవు పాలకుర్తి. ఘనమైన త్రిలింగ, తెలంగాణ సారస్వత, చారిత్రక వారసత్వానికి ప్రతీక. సీఎం కేసీఆర్ ప్రగతి పాలనలో జనం మెచ్చిన నేత ఎర్రబెల్లి దయాకర్రావు సారథ్యంలో ప్రగతికి కేరాఫ్గా పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నది. 1994లో అప్పటి వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు 2009లో పాలకుర్తిలో పాగావేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. సంక్షేమంతోపాటు ప్రగతి ఫలాలనూ ప్రజలకు చేరువ చేస్తూ.. నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కంచుకోటగా మలిచారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలకుర్తి – బమ్మెర – వల్మిడి కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లకు రూ. 163 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 33 వేల 29 ఎకరాలు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండగా, నేడు 77 వేల 67 ఎకరాలకు పెంచారు. మిషన్ కాకతీయ ద్వారా 331 చెరువులను అభివృద్ధి చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పరిధిలో 79.59 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణం చేపట్టారు. యశ్వంతాపూర్, దేవరుప్పుల, పాలేరు, ఆకేరు వాగులపై 27 చెక్ డ్యాంలను నిర్మించారు. దీంతో భూగర్భజలాలు పెరిగాయి.
రైతుబీమా పథకంలో 1,027 కుటుంబాలకు సాయం అందించారు. ఆరు మండలాల్లో రైతు వేదికలను నిర్మించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 9,162 మంది లబ్ధిదారులకు రూ.87.1 కోట్లు అందజేశారు. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని 442 ఆవాసాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. 104 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. 4,561 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందజేశారు. 56 నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు. 10 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నారు. వేలాది మందికి కేసీఆర్ కిట్లు అందజేశారు. ఆరు మండలాల్లోని 177 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. తొర్రూరు, దేవరుప్పుల, కొడకండ్ల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సెంట్రల్ లైటింగ్, డివైడర్ల విస్తరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మార్కెట్లు, పార్కులు ఏర్పాటు చేశారు.
352.41 కి.మీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశారు. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మెటల్రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 181 కి.మీ డబుల్ రోడ్లు, రూ.143 కోట్ల 24 లక్షలతో బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశారు. తండాలకు రూ.8 కోట్ల 65 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు నిర్మించారు.