సూర్యాపేట : ప్రజలందరు మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఅన్నారు.
మేళ్ల చెరువు మండల కేంద్రంలో త్వరలో జరగబోయే శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి, మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా మేళ్ల చెరువు జాతర ఉండబోతుందన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేలా పక్కా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
మేళ్ల చెరువులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. కోటి రూపాయలతో వ్యయంతో దేవస్థాన ప్రాంగణంలో కోనేరు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించామన్నారు.
జాతరను ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎడ్ల పందాలు (వృషభ రాజుల బండ లాగుడు) పోటీలు కూడా భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు శివాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు.