Fight for cat | హుజూర్నగర్ : అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా అలజడి ! ఒకరు ఇద్దరు కాదు.. దాదాపు 50 మంది స్టేషన్లోకి దూసుకొచ్చారు. రెండు గుంపులుగా చీలిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ స్టేషన్ లోపలికి వచ్చేశారు. ఒక్కసారిగా ఇంతమంది వస్తున్నారంటే.. ఎంత పెద్ద గొడవ అయ్యిందోనని పోలీసులు కూడా చాలా కంగారు పడిపోయారు. ఏమైందని వారిని ఆరా తీస్తే.. వాళ్లు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. ఎందుకు.. ఏమైందని అనుకుంటున్నారా? అదేదో భూ తగాదానో.. ఆస్తి తగాదానో కాదు.. కేవలం ఒక పిల్లి కోసం జరిగిన పంచాయితీ !! సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగిన ఈ వింత పంచాయితీ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
హుజూర్నగర్ పట్టణానికి చెందిన మధ్యల ముత్యాలు ఏడాది క్రితం మైసూర్ నుంచి ఒక పిల్లిని తెచ్చి పెంచుకుంటుంది. జూలీ కుక్క లక్షణాలు ఉన్న ఆ పిల్లిని ఎంతో ప్రేమ పెంచుకున్నారు. అయితే 10 నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఇటీవల రామస్వామి గుట్ట వద్ద జాతరకు వెళ్లిన ముత్యాలు.. బానోతు సుక్కమ్మ అనే మహిళ ఇంటి ముందు తన పిల్లిని గమనించింది. దీంతో నాలుగు రోజులు సుక్కమ్మ ఇంటికి వెళ్లిన ముత్యాలు.. ఆ పిల్లి తనది అని.. మైసూర్లో కొనుక్కొచ్చానని చెప్పింది. తన పిల్లిని తనకు ఇచ్చేయాలని అడిగింది. ఇందుకు సుక్కమ్మ ససేమిరా అన్నది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
నా పిల్లిని నాకు ఇస్తే ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తానని ముత్యాలు చెబుతుండగా.. ఇంటికి వచ్చి ఘర్షణకు దిగిందన్నే కోపంతో అవసరమైతే పిల్లిని ఫారెస్ట్ అధికారులకు అయినా ఇస్తా కానీ ముత్యాలకు మాత్రం ఇవ్వనని సుక్కమ్మ మొండిపట్టు పట్టింది. ఈ గొడవ కాస్త చూస్తుండగానే పెద్దగా మారింది. ఇలా ఘర్షణకు దిగిన ఇరువర్గాల పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే విషయం మొత్తం విన్న ఎస్సై ఇద్దరికీ రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఏదేమైనా పిల్లి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఈ పంచాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి పోలీస్ కౌన్సెలింగ్ తరువాత పిల్లి కోసం కేసుల వరకు వెళ్తారా…? ఎవరో ఒకరు కాంప్రమైస్ అవుతారో వేచిచూడాల్సి ఉంది…