అర్వపల్లి, మే 11 : కరోనా కట్టడికి పల్లెల్లో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, శానిటేషన్ పనులు చేస్తూనే ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క వైద్య సిబ్బంది జ్వరం సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని కాసర్లపహాడ్ గ్రామంలో మంగళవారం వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి జ్వర బాధితులకు మందులు పంపిణీ చేశారు. కుంచమర్తి గ్రామంలో పంచాయతీ సిబ్బంది వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేశారు. అలాగే, ఆయా గ్రామాల్లో సర్పంచులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
నూతనకల్, మే 11 : కరోనా వైరస్ నియంత్రణకు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తీగల కరుణ మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు గ్రామంలోని ప్రతి వీధిలో హైపోక్లోరైట్ పిచికారీ చేయించామన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, వీలైనంత వరకు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకు సహకరించాలని ఆమె కోరారు.