సూర్యాపేట, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జాతీయ సమగ్రతకు తెలంగాణ మార్గదర్శనం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. అయితే కులాల పేరుతో, మతాల పేరుతో విచ్చిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని.. ఆ ఉచ్చులో తెలంగాణ సమాజం పడవద్దన్నారు. సెప్టెంబర్ 17న జరుపుకునేది ముమ్మాటికి జాతీయ సమైక్యతా దినోత్సవమేనని ఆయన స్పష్టం చేశారు. చరిత్ర తెలియని వారు వక్రీకరించి చెప్పే బాష్యాలు మనలో మనకు తగవులు పెట్టేందుకేనన్నారు. తెలంగాణ జాతీయ సమగ్రతా వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు పాల్గొని ప్రసంగించారు.
అలాగే జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీని మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. అనంతరం పీఎస్ఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ర్యాలీ ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని, ఇది యావత్ దేశానికి చాటి చెప్పేందుకే సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్లు ఇక్కడ సోదరభావంతో కలిసిపోయారన్నారు. 1948లోనే మహాత్మాగాంధీ ఇక్కడి సంస్కృతిని వర్ణిస్తూ గంగా, జమునా తెహజీబ్కు హైదరాబాద్ రాష్ట్రం పెట్టింది పేరు అన్న వ్యాఖ్యలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సంస్కృతి యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని చెప్పారు. కలసి ఉంటేనే పురోగతిని సాధించవచ్చని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అన్నారు.
విడిపోయినప్పుడే విదేశీయులు భారతదేశం మీద దండయాత్రలు కొనసాగించారన్నారు. మన దేశ భూభాగంలో కానీ, జనాభాలో కానీ ఒకటో వంతు కూడా లేని ఫ్రెంచ్, డచ్, పోర్చ్గీస్, బ్రిటీష్ దేశాలు వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని ఏలిన విధానమే ఇందుకు నిదర్శనమన్నారు. వర్ణ వ్యవస్థ, కులాల పేరుతో విభజన అందులో భాగమే అన్నారు. 784 సంస్థానాల విలీనంతో అఖండ భారత్ ఆవిర్భవించిందన్నారు. నాటి ప్రధాని దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రు చొరవతో హైదరాబాద్ రాష్ట్రం భారత్లో కలిసిందన్నారు. వర్తమానానికి చరిత్రను తెలిపేందుకే సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.