సూర్యాపేటసిటీ, ఆగస్టు 9 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఫ్రీడం రన్లో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటి చెప్పాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మండ్లపల్లి కల్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహించి కార్యాచరణను వివరించారు. 14 థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శన, 10న వన మహోత్సవం, 11న ఉదయం 7 గంటలకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఫ్రీడం రన్, 12న రక్షాబంధన్, 13న గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ, 14న కళాకారులచే కళా ప్రదర్శన, 16న సామూహిక జాతీయ గీతాలాపాన, 17న రక్తదానం, 18న క్రీడల నిర్వహణ, 21న స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన అమరుల స్మరణ, 22న నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్య్ర భారతావని అవతరణ, సమర యోధుల త్యాగాన్ని భావి తరాలకు చాటి చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, సీఐలు సోం నారాయణ్సింగ్, రామలింగారెడ్డి, రాజేశ్, రవికుమార్, రాజశేఖర్, ఎస్ఐలు శ్రీనివాస్, క్రాంతి, యాకుబ్, సైదులు పాల్గొన్నారు.
గాంధీ చిత్ర ప్రదర్శన
సూర్యాపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించిన గాంధీ చిత్ర ప్రదర్శనలో మొదటి రోజు 58 పాఠశాలలకు చెందిన సుమారు 5,449 మంది తిలకించినట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రదర్శించిన మూవీని అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, ఆర్టీఓ వెంకటయ్య, ఎంఈఓ శైలజ వీక్షించారు. ఈ నెల 20 వరకు ప్రతి రోజు 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మూవీని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
విద్యార్థి దశలోనే దేశభక్తి అలవర్చుకోవాలి : కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి
కోదాడటౌన్ : విద్యార్థి దశలోనే దేశ భక్తి, జాతీయతా భావాన్ని అలవర్చుకోవాలని కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని రంగా థియేటర్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గాంధీ సినిమాను వీక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. ఎంఈఓ సలీంషరీఫ్ మాట్లాడుతూ.. ఈ 22 వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించనున్నట్లు వెల్లడించారు.
వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి : సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ.. భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంపిణీ చేసిన జాతీయ జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేసేలా కౌన్సిలర్లు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే షెడ్యూల్లో రూపొందించిన విధంగా రోజూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
తపాలా ఉద్యోగుల ర్యాలీ
బొడ్రాయిబజార్ : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట తపాలా ఉద్యోగులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత వజ్రోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోస్టల్ వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, పోస్ట్మాస్టర్ జయమ్మ పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణ తపాలా శాఖ మేనేజర్ రవి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోదాడ పోస్టాఫీస్ పరిధిలోని అన్ని గ్రామాల తపాల సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని టేకుమట్ల, ఎండ్లపల్లి గ్రామాల్లో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్రావు, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచ్ దండి సుగుణమ్మ, పంచాయతీ కార్యదర్శులు నర్సింహారావు, గీత పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
నేరేడుచర్ల : ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ శ్రీలతారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపాలిటీలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాషా, బచ్చలకూరి ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
పోలీసుల బైక్ ర్యాలీ
హుజూర్నగర్ : స్థానిక పోస్టాఫీస్ సిబ్బందితో కలిసి పోలీసులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాచౌక్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్ఐ కట్టా వెంకట్రెడ్డి ,పోస్టుమ్యాన్ మతిన్, సిబ్బంది పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : ఆజాదీ కా అమృత్ ఉత్సవాలను జయపద్రం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్రెడ్డి కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వేముల శేఖర్రెడ్డి, అబ్బాస్, సత్యనారాయణరెడ్డి, వెంకటరామయ్య, గోపిరాజు పాల్గొన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో..
పాలకవీడు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ 11న ఉదయం 7 గంటలకు మండల కేంద్రం నుంచి గుడుగుంట్లపాలెం గ్రామం వరకు ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు. మండలం లోని ఉత్సావంతులైన విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నాగారం(అర్వపల్లి) : ఈ నెల 11న సూర్యాపేట జనగాం జాతీయ రహదారి 365బి పై పెట్రోల్ బంక్ నుంచి అర్వపల్లి సెంటర్ వరకు ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ: కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
స్వాతంత్య్ర భావతావని వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి పట్టణంలోని 48 వార్డుల్లో వార్డు అధికారులు, కౌన్సిలర్ల సమక్షంలో ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా 14 రోజుల పాటు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్.మోహన్రావు, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. మంగళవారం జాతీయ జెండా రూపుదిద్దుకున్న నడిగూడెం కోటలో పతాకావిష్కరణ చేశారు. పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళర్పించి మాట్లాడారు. బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దని కొనియాడారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో నాటి మునగాల పరగణ, నడిగూడెం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. దేశం మొత్తం సెల్యూట్ చేసే జాతీయ జెండా ఇక్కడ తయారు కావడం మన నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. అనంతరం ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, ఎంపీడీఓ ఎర్రయ్య, తాసీల్దార్ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.