సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) :పేద, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. మోదీ సర్కారు అవలంబిస్తున్న విధానాలతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా రూ.50 పెంపుతో రూ.1105కు చేరింది. 2014లో రూ.410 ఉన్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ఎనిమిదేండ్లలో రూ.695 పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఇక గ్యాస్ ధరల పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి వాడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సుమారు 6.50 లక్షల మంది వినియోగదారులు ఉండగా రూ.50 పెంపుతో రూ.3.25కోట్ల అదనపు భారం పడనున్నది. గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి పిలుపుమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నేడు టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెస్సుల పెంపు, సబ్సిడీల తగ్గింపుతో సామాన్యులపై పెనుభారం మోపుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ.. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. మరో వైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేద ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతూ.. దాని ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదు. దానికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలకు కూడా రెక్కలు వస్తుండడంతో పేదలు బతకలేని పరిస్థితి నెలకొంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 2014లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండగా నేడు రూ.1,105కు చేరింది. గడిచిన నాలుగు నెలల్లోనే రూ.103 పెరుగగా తాజాగా రూ.50తో కలుపుకుంటే పెంపు రూ.153కు చేరింది.
ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.3.25 కోట్ల భారం
గ్యాస్ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వినియోగదారులపై నెలకు రూ.3.25 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. నల్లగొండ జిల్లాలో 31 గ్యాస్ ఏజెన్సీలు, 4,15,805 కనెక్షన్లు ఉండగా సూర్యాపేటలో 25 ఏజెన్సీలు 3,37,766 కనెక్షన్లు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 గ్యాస్ ఏజెన్సీలు 2,03,965 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తంగా వివిధ కంపెనీలకు చెందిన 73 గ్యాస్ ఏజెన్సీలు 9,57,536 మంది వినియోగదారులు ఉండగా ప్రతి నెలా సుమారు 6.50లక్షల గ్యాస్ సిలిండర్లు గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్పై రూ.50 పెంపుతో వినియోగదారులపై నెలకు రూ.3.25 కోట్ల అదనపు భారం పడనున్నది.
ఉద్యమ బాటలో గులాబీ శ్రేణులు
కేంద్రంలోని మోదీ సర్కార్ నిరంతరాయంగా వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ పోవడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. భువనగిరి పట్టణంలో నిరసనలకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతామహేందర్రెడ్డితో పాటు మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమైనట్లు రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు.