సూర్యాపేట, జూన్ 20 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీ, జిల్లా అధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్గున్యా, మెదడువాపు, ఫైలేరియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారంను డ్రై డేగా పాటించేలా చూడాలన్నారు. డ్రై డే నిర్వహణపై గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో థీమోఫాల్స్ అందుబాటులో ఉంచి వినియోగించాలని అలాగే ఫాగింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే చిలుకూరు మండలం బేతవోలు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పందుల కొరకు ప్రత్యేక స్థలాలు పరిశీలించి నివేదికలు అందజేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల కళాజాత నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఎంహెచ్ఓ కోటాచలం, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాహితి, డీపీఓ యాదయ్య, జిల్లా అధికారులు సౌజన్య, శంకర్, జ్యోతిపద్మ, అనసూయ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సంబంధ విషయాలకు సంబంధించిన సమస్యలను మీసేవా ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు పాల్గొన్నారు.
భాగస్వాములకు కృతజ్ఞతలు
పల్లె, పట్టణ ప్రగతిలో పాల్గొన్న అందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 3 నుంచి 18 వరకు చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేసినట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధిలోనూ ఇదే చొరవ చూపాలని కోరారు.