బొడ్రాయిబజార్, ఏప్రిల్ 19 : వారం రోజులుగా ధాన్యం భారీగా తరలివస్తుండటంతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో టోకెన్ విధానం అమలు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ట్రేడర్లు, కమీషన్దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్కెట్లో సమస్యలు తలెత్తకుండా హమాలీలు, రైతులకు మేలు చేసేలా టోకెన్ విధానం కొనసాగుతుందన్నారు. ప్రతి రోజూ 30 వేల బస్తాల వరకు టోకెన్లను కేటాయించనున్నట్లు చెప్పారు. టోకెన్ల జారీ ప్రక్రియను కమీషన్దార్ల యూనియన్కు అప్పగించినట్లు వెల్లడించారు. వారు మార్కెట్లో కమీషన్దారుల టర్నోవర్ను బట్టి ఏ, బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి టోకెన్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రైతులు తమ కమీషన్దారుల వద్ద టోకెన్ తీసుకొని మార్కెట్కు రావాలని సూచించారు. రోజూ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు టోకెన్ కలిగిన ధాన్యాన్ని మార్కెట్లోకి అనుమతించనున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ కమీషన్దారుల నుంచి టోకెన్లు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మార్కెట్లోకి అనుమతి ఉండదని తెలిపారు. కమీషన్దారులు టోకెన్ విధానాన్ని సజావుగా సాగించాలని, టోకెన్ దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్, సహాయ కార్యదర్శి జి.పుష్పలత, యూడీసీ ఖాసీం, సూపర్వైజర్లు శ్రవణ్కుమార్, షమ్మి, సుధీర్, ట్రేడర్స్, కమీషర్దారులు పాల్గొన్నారు.