సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ఏ పథకం చేపట్టినా మహిళల చేతిలోనే పెట్ట డం… మహిళల రక్షణ కోసం షీ టీమ్స్కు రూపకల్పన చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా రక్షకుడిగా మారారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఏ మేనేజ్మెంట్ అయినా మహిళల చేతిలో ఉంటే అది బాగుపడుతుందని గట్టిగా నమ్మేవారిలో ప్రథముడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశానికే దిక్సూచిలా రాష్ట్రంలో మహిళా సాధికారిత కొనసాగుతున్నదని తెలిపారు. సూర్యాపేటలో తనను రెండు సార్లు గెలిపించింది మహిళలేనని, మూడో సారి కూడా విజయపథంలో నడిపిస్తారనే దృఢ విశ్వాసం ఉన్నదని అన్నారు.
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన స్థానిక త్రివేణి ఫంక్షన్హాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్న సంబురాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్య, ఉపాధి, ఉద్యోగంతో పాటు అన్ని రంగాల్లో మహిళలు పురుషులకు దీటుగా విజయాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. చరిత్రను పరిశీలిస్తే పిల్లలను సాకడం మొదలుకొని కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కూడా మహిళలే చూసుకునేవారని, అయితే రానురానూ పురుషాధిక్యత పెరిగిందని తెలిపారు. మహిళలు బలహీనంగా ఉంటారని వారిని పలు పనులకు దూరం చేయడం ద్వారా లింగవివక్ష ప్రారంభమైందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది హాజరుకావడం, వేదికపై దాదాపు 50 మందికి పైగా ప్రసంగించడంతో మహిళా చైతన్యం కనిపిస్తున్నదని చెప్పారు. మహిళల చేతిలో మేనేజ్మెంట్ ఉంటే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారని, అందుకే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఎవ్వరూ అడుగకున్నా, ఏ ఒక్కరూ డిమాండ్ చేయకున్నా, మేనిఫెస్టోలో చేర్చకపోయినా పేద, మధ్య తరగతి వర్గాల ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని తెలిపారు. విద్యుత్ శాఖలో దేశంలోనే తొలి సారిగా 217 మంది లైన్ఉమెన్లను నియమించామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో 50శాతం మహిళలకు కేటాయించగా సూర్యాపేటలో అంతకు మించే అమలవుతున్నదని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మను గుర్తు చేస్తూ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణతో పాటు నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, మెప్మా, ఆర్పీ, పట్టణ సమాఖ్యలు, వీబీకేలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.