ఆత్మకూర్(ఎస్), ఫిబ్రవరి 21 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నంద్యాలవారిగూడెంలో రూ.1.65 కోట్లు, పుప్పాలగూడెంలో రూ.80 లక్షలతో బీటీ రోడ్లు, ఆత్మకూర్(ఎస్)లో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 50 డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లన్న దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండేలా చూస్తామని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలుచేస్తూ వారికి అండగా నిలిచారని గుర్తుచేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలత, సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీలు వెంకట్రెడ్డి, కాకి శోభ, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ జానయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు రాజేంద్రప్రసాద్, మర్ల చంద్రారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్, కాకి కృపాకర్రెడ్డి, బ్రహ్మం పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
ఆరోగ్యవంత సమాజ ఏర్పాటుకు క్రీడలు దోహదం చేస్తాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తిరుమల గ్రాండ్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని, క్రీడలు జీవితంలో మెళకువలు నేర్పిస్తాయన్నారు. జాతీయ స్థాయి క్రీడలను సైతం సూర్యాపేటలో విజయవంతంగా నిర్వహించుకున్నామని, మున్ముందు మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాను మొదటిస్థానంలో నిలుపేందుకు సహకరించాలన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒలింపిక్ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి జగదీశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి కర్తయ్యతోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ ఎంఏ హఫీజ్ఖాన్, పరిశీలకుడు అజీజ్ఖాన్, డీవైఎస్ఓ వెంకట్రెడ్డి, 24 క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఇమాంకాశీం, గడ్డం వెంకటేశ్వర్లు, నామా నర్సింహారావు, నాతి కృష్ణమూర్తి, రాంచందర్గౌడ్, యానాల ప్రభాకర్రెడ్డి, పొన్నగాని కృష్ణమూర్తి, చంద్రయ్య, భూలోకరావు, లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.