పెన్పహాడ్, ఫిబ్రవరి 18 : మండలంలోని దోసపహాడ్లో బొడ్రాయి, సీతారామాంజనేయ లక్ష్మణ కీర్తిధ్వజ, ఆంజనేయ నవగ్రహ, కోటమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. శుక్రవారం బొడ్రాయితో పాటు సీతారామాంజనేయ, లక్ష్మణ, ఆంజనేయ నవగ్రహ, కోటమైసమ్మ దేవతా మూర్తుల ఏకశిల విగ్రహాలను వీధి వీధిన ఊరేగించారు. ఊరేగింపు సమయములో భక్తులు జలాభిషేకం, కుంకుమాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. వేద పండితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు చేశారు. నేడు వేలాది భక్తజన సందోహం నడుమ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ జరగనుంది. కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రానున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు.
అట్టహాసంగా మహిళా కోలాట పోటీలు
పెన్పహాడ్ : చిన్న మేడారంగా పేరొందుతున్న గాజులమల్కాపురం సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న మహిళా కోలాట పోటీలు, కబడ్డీ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ బండి ధనమ్మ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాతాల వెంకట్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, మధుసూదన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా గరుడ వాహన సేవ
అర్వపల్లి : మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున స్వామివారికి గరుడ వాహనసేవను నిర్వహించారు. ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేతంగా యోగానంద లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఆలయ కమిటీ ఛైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, కాప వెంకటేశ్వర్రావు, బైరబోయిన రామలింగయ్య, కనుకు శ్రీనివాస్, ధర్మకర్తలు మెండె సురేశ్, కోటమర్తి మల్లయ్య, పులిచర్ల ప్రభు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
చిల్పకుంట్లలో ఘనంగా ప్రతిష్ఠాత్సవాలు
నూతనకల్ : మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో నాబిశిల బొడ్రాయి, ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై దేవతా విగ్రహాలను కొలువుదీర్చి భజన, డప్పు వాయిద్యాలతో పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేణుగోపాల, సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు
హుజూర్నగర్ : పట్టణ పరిధిలోని వేణుగోపాల, సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే శానంపూడి సతీమణి రజిత, ఆర్డీఓ వెంకారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ కొండారెడ్డి, స్థానాచార్యులు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
అరవింద ధ్యాన మందిర ఉత్సవాలు ప్రారంభం
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల అరవింద ధ్యాన మందిర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు ధ్యాన మందిరంను అలంకరించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలరించాయి.