సూర్యాపేట, ఫిబ్రవరి 17: పని లేని ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ముమ్మరంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. యాసంగి వరి నాట్లతో పాటు ఇతర పంటల పనులు తగ్గుముఖం పట్టాయి. దాంతో గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగం పెంచాలని కూలీలు సైతం ఎక్కువగా వచ్చేలా పనులను గుర్తించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం జిల్లాలో రోజుకు 8 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను భారీగా పెంచి లక్ష్యం చేరుకోనేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పనులు మురిగి పోకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఉపాధి హామీలో మొత్తం 90 రకాల పనులు చేయాల్సి ఉండగా జిల్లాలో ప్రధానంగా 15 లోపు పనులను మాత్రమే ఎంచుకుని పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చెరువుల పూడిక తీయడం, ఫీడర్ చానల్, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అభివృద్ధ్ది ఫీల్డ్ చానల్ ఆధునీకరణతో పాటు హరితహారం వంటి పనులతోపాటు ఇతర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపాధి పనులు చేయిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు 707 ఆవాసాల పరిధిలో 2,65,583 జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఈ జాబ్ కార్డుల్లో 6,16,495 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,82,164 జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. 3,64,000 మంది సభ్యులు మాత్రమే రోజు ఉపాధి పనికి వెళ్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండి సొంత గ్రామాలకు వచ్చిన వారు కొత్తగా ఉపాధి కార్డులు పొందారు. గత ఆర్థిక సంవత్సరం 5,122 కుటుంబాలకు కొత్తగా జాబ్కార్డు ఇవ్వగా 13,636మంది సభ్యులుగా ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 1.08 కోట్ల పనిదినాలు కల్పించాలని నిర్ణయించి ప్రణాళికలు తయారు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 72.42 లక్షల పనిదినాలు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. కేవలం 66.91శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 72.42 లక్షల పనిదినాల్లో కూలీలు , మెటీరియల్కు 182.19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందుకు 122.90 కోట్లు కూలీలకు వేతన రూపంలో ఇచ్చారు. మిగిలినవి మెటీరియల్ ఖర్చు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,59,713 కుటుంబాల్లో 2,93,454 కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించడం జరిగింది. రోజువారీ వేతనంగా ఒక కూలీకి సగటున రూ. 173.16 వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 14,012 కుటంబాలు వంద రోజులు పని పూర్తి చేశాయి.
2022-23 సంవత్సరానికి తగ్గిన పనిదినాలు
జిల్లాలో ప్రతి ఏటా ఉపాధి హామీ పని దినాలు తగ్గుతూ వస్తున్నాయి. 2020-21 సంవత్సరంలో 1.17 కోట్ల పనిదినాలు ఉండగా 2021-22 సంవత్సరంలో 1.08 కోట్లకు చేరింది. గతేడాది కూడా 70 లక్షల పనిదినాలకు గ్రామ సభలు ఆమోదం తెలిపి పంపగా కరోనా వల్ల ఉపాధి పోవడంతో అందరికీ పని కల్పించాలనే లక్ష్యంతో ఆ సంఖ్యను పెంచారు.
2022-23 సంవత్సరానికి ఏకంగా 79.23 లక్షల పనిదినాలకు కుదించడం జరిగింది. దాదాపు 28.77 లక్షల పనిదినాలను తగ్గించారు. 2022-23 సంవత్సరానికి కేటాయించిన పనిదినాలు మండలాల వారీగా టార్గెట్లను ఇచ్చారు. ఈ పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
టార్గెట్ చేరుకుంటాం
ఉపాధి హామీ పనుల టార్గెట్ను వంద శాతం చేరుకుంటాము. ఇప్పటి వరకు 66.91 శాతం పూర్తయ్యాయి. మిగిలిన రోజుల్లో వంద శాతం పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. వ్యవసాయ పనులు తగ్గు ముఖం పట్టడంతో ఆ రంగ కూలీలు ఉపాధి హామీ పనులకు రావడం ప్రారంభమమవుతుంది. మార్చి చివరి నాటికి వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. క్షేత్ర స్థాలో పర్యటిస్తున్నాం
-సుందరి కిరణ్కుమార్, డీఆర్డీఓ, సూర్యాపేట