సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట క్రైం : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలోని సర్వీస్ రోడ్డుపై సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఖాళీ పెట్రోల్ ట్యాంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ పేలింది. పేలుడు ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలిన ట్యాంకర్ శకలాలు కిలోమీటరు దూరంలో పడ్డాయి. పేలుడు శబ్దం, శకలాలు పడడంతో పరిసరాల్లోని పలు ఇండ్ల అద్దాలు, ఇళ్లపై పైపులైన్లు పగిలిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భూకంపం వచ్చిందేమోనని ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
గ్యాస్ ఫామ్ కావడంతోనే..
చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన గట్టు అర్జున్ తన లారీ ట్యాంకర్ ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తుంటాడు. ట్యాంకర్ వాల్వ్ లీకేజీ సమస్యతో హైవే వెంట సర్వీసు రోడ్డులోని గ్యాస్ వెల్డింగ్ దుకాణం వద్దకు వచ్చాడు. వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దాంతో వెల్డర్ మంత్రి అర్జున్(35), లారీ డ్రైవర్ గట్టు అర్జున్(51) అక్కడికక్కడే మృతిచెందగా అక్కడే ఉన్న డ్రైవర్లు మల్లేశ్, వెంకటనారాయణ, రమణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా దవాఖానకు తరలించగా మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పంపారు. ట్యాంకర్ ఖాళీగానే ఉన్నప్పటికీ ఇన్నాళ్లుగా అందులో గ్యాస్ ఫామ్ కావడంతోనే వెల్డింగ్ చేస్తున్న సమయంలో వేడెక్కి పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మోహన్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కిలోమీటర్ ఎగిరిపడ్డ శకలాలు
ట్యాంకర్ భారీ శబ్దంతో పేలడంతో దాని శకలాలు దాదాపు కిలోమీటరు దూరం వరకు పడ్డాయి. బాలాజీనగర్, మెట్రో ఆసుపత్రి, విద్యానగర్, కొత్తబస్టాండ్తోపాటు స్థానిక గాంధీ విగ్రహం పరిసరాల్లో శకలాలు పడ్డాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. పేలుడు ధాటికి 500 మీటర్ల పరిధిలోని ఇండ్ల అద్దాలు, దర్వాజలు సైతం ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు శకలాలు గాలిలో ఎగిరి సుదూర ప్రాంతంలో పడ్డాడు. ఎవరిపైనా పడకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
బాంబు పేలిందనుకున్నాం..
ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. భూకంపం వచ్చిందా? లేక బాంబు పేలిందా? అని భయంతో బయటకు వచ్చి చూశాం. ఆ ప్రాంతమంతా పొగ, దుమ్ము కమ్ముకొని భయానక వాతావరణం కనిపించింది. దగ్గరకు వెళ్లాలంటేనే భయమేసింది. కొద్ది సేపటి తరువాత వెళ్లి చూస్తే అక్కడ ముగ్గురు తీవ్రగాయాలతో రక్తమోడుతూ పడి ఉన్నారు. ఇంత భారీ శబ్దం ఎప్పుడూ వినలేదు.
– పూజర్ల కుమార్, స్థానికుడు
అతుకులు వేస్తేనే బతుకు… ఆ ఆధారం పోయింది
ట్యాంక్ పేలి వెల్డింగ్ యజమాని మంత్రి అర్జున్ మృత్యువాడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పాత వస్తువులకు వెల్డింగ్ చేస్తూ కుటుంబాన్ని సాకుతున్న అర్జున్ మృతి చెందడంతో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. అర్జున్ మృతితో పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.