సూర్యాపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ఈ పట్టణం పరిచయమున్న వారికి రాపోలుగుడి సుపరిచితమే. రాపోలుగుడి పేరులోనే గుడి ఉన్నా అక్కడ ఎలాంటి దైవారాధన, ధూపదీప నైవేద్యాలు, ఆధ్యాత్మిక వాతావరణం కనిపించట్లేదు. స్థానికులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు కోరినా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఈ ఆలయాన్ని పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొనడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ చరిత్ర : క్రీ.శ 1354వ సంవత్సరంలో ఆమనగల్లు కేంద్రంగా పరిపాలించిన పద్మనాయకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. పద్మనాయకులు మూసీనది పరీవాహక ప్రాంతమైన ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయంలోని కలశాలు, చెక్కడాలను బట్టి తెలుస్తున్నది. ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను బట్టి అది ముమ్మాటికీ పద్మనాయకుల కాలంలోనే నిర్మించిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేగాక ఈ ఆలయంపై ఉన్న కలశం, రాష్ట్ర ప్రభుత్వ కలశం ఒకే మాదిరిగా ఉండడాన్ని బట్టి పద్మనాయకుల ఆధారంగానే తీసుకున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆలయం వైష్ణవ ఆలయమని తెలుస్తున్నది. మధ్య అంతరాలయానికి ఇరువైపులా శంకుచక్రధారులైన జయ, విజయుల ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఇరువైపులా రెండు అంతరాలయాలు నిర్మించి ఉన్నాయి. ఇలాంటివి వైష్ణవ ఆలయాలకే ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు. అంతేగాక ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి, అళ్వార్లకు సంబంధించిన ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. వీటన్నింటితో పాటు శిథిలావస్థలో ఉన్న గర్భగుడిలో ఓ ఆసనం ఉంది. దానిపై గరుడ అళ్వార్ అని చెక్కబడి ఉండడాన్ని బట్టి వైష్ణవాలయంగా చెప్పవచ్చంటున్నారు.
ఆచరణకు నోచని పునరుద్ధరణ పనులు
రాపోలు గుడి పునరుద్ధరణకు పట్టణానికి చెందిన ప్రముఖులు గతంలో ముందుకు వచ్చినా ఆచరణకు నోచుకోలేదు. ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, స్థానిక వేంకటేశ్వర ఆలయ ప్రధానార్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, డాక్టర్ రామయ్య ఆలయం పునరుద్ధరించి నిత్య దీప, ధూప, నైవేద్యాలు ఉండేలా చూడాలని కోరుతున్నారు. 2013లో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహణకు కొందరు ముందుకు వచ్చినా నాటి పాలకుల సహకారం లేక అర్థ్ధాతరంగా నిలిచిపోయాయి. సెంటర్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితో సమావేశమయ్యారు. ఆలయం ఏ స్థాయిలో ఉంది… ఎలాంటి మరమ్మతులు చేస్తే అందుబాటులోకి వస్తుం దో అంచనాలు వేయాలని కోరినట్లు సమాచారం. ఆలయ పునరుద్ధరణ కోసం పండితులతో త్వరలోనే సమావేశం కానున్నట్లు తెలిసింది. మొత్తం మీద దశాబ్దాల తరబడి ల్యాండ్ మార్కుకే పరిమితమైన అత్యంత పురాతన ఆలయం పునరుద్ధరణకు నోచుకోవడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సువిశాలమైన ప్రాంగణం
ఆలయ ప్రాంగణం 58స్తంభాలతో సువిశాలంగా ఉంది. భక్తులు దేవుడి దర్శనానికి నిలబడే రంగమండపం సైతం ఎంతో విశాలంగా ఉంది. ఈ రంగమండపం మధ్య పైభాగంలో పద్మదళాలు, అష్టదిక్పాలకులు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం జిల్లావ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. సుమారు 70ఏండ్ల క్రితం ఈ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయని కొంతమంది తవ్వకాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు.