ఆత్మకూర్(ఎస్), జూన్ 26 : ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రతి ఇంట్లోనూ పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు పెంచేందుకు తగిన ప్రణాళికలు రూపొందించారు. గతంలో పర్యవేక్షణ లోపంతో అధిక సంఖ్యలో మొక్కలు వృథా అయినట్లు విమర్శలు రావడంతో ఈ దఫా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గతంలో మొక్కలను ఇతర మండలాల నుంచి తెప్పించుకోగా.. ఈ సంవత్సరం మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జనవరిలో నర్సరీలకు విత్తనాలు అందజేయగా ప్రస్తుతం మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. నర్సరీల్లో పూలు, పండ్లు, నీడనిచ్చె మొక్కలను పెంచుతున్నారు. ఈ సంవత్సరం మండలంలో 4లక్షలా 38వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇండ్లల్లో నాటే మొక్కలను ఎవరికి వారు సంరక్షించుకోవాలని, రోడ్ల వెంట, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నాటే మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీలోనూ వన నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నామని, వచ్చే నెలలో నాటేందుకు సిద్ధంగా ఉంచామని మల్సూర్నాయక్ తెలిపారు.