అర్వపల్లి : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కరోన టీకా వేసి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కరోనా టీకాపై ఉన్న అపోహలను వీడి ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని కోరారు.
మొదటి డోసు వేసుకున్న వారు సమయానుకూలంగా రెండో డోసు టీకా వేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు విధిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి నవీన్, సీహెచ్ఓ చరణ్నాయక్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వీఆర్ఏ విజయ్, వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.