సూర్యాపేటఅర్బన్, మార్చి 28: మండల కేంద్రాల్లో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగి సూర్యాపేట రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని, రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ.45 కోట్లతో 27,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 11 గోడౌన్లను నిర్మించామన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 20 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లలో ఈ నామ్ అమలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న 478 మంది లబ్ధిదారులకు గొర్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
రైతులకు పథకాలందేలా చూడాలి
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి, కోదాడ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని రైతులకు అందేలా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరిగితే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం ఎంపీపీలు, జడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, అధికారులు కిరణ్కుమార్, రామారావు, సౌజన్య, భిక్షపతి, పుల్లయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రావు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.