నరాలపై తీవ్ర ప్రభావం..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. చాలా మందికి తమకు వైరస్ వచ్చింది అన్న సంగతి తెలియడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయనుకుంటున్నారు. అంతకంటే ముందుగానే కొంత మందిలో నరాలపైనా ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా మెదడు సరిగా పనిచేయదు. కరోనా సోకడంతో మెదడుపై పలుచని పొర ఏర్పడుతుంది. వైరస్ ఉన్న వ్యక్తికి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఏ పనీ చేయలేరు. చికాకుగా ఉంటుంది. ఇలాంటి కేసులు మాదాపూర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొన్ని నమోదయ్యాయి. 50 ఏండ్లు దాటిన ఓ పేషెంట్ జ్ఞాపక శక్తి తగ్గిందంటూ దవాఖానకు రాగా పరీక్షలు నిర్వహించారు. అందులో ఈ విషయం స్పష్టమైంది.
మానసికంగా మార్పులు..
కరోనా సోకిన వారిలో మానసికమైన మార్పులు వస్తున్నాయి. త్వరగా డిప్రెషన్కు గురవుతున్నారు. మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుంటారు. అలాగే నిద్ర ఉండదు. ఈ క్రమంలో మానసిక వైద్యులను సంప్రదించాలి.
వ్యాక్సిన్ తీసుకున్నా.. జాగ్రత్తలు తప్పనిసరి..
కరోనా బారిన పడి బాధ పడే కంటే.. వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందులో భాగంగానే డాక్టర్లు కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. వైరస్ను నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు, మాస్కు ధరించడమే శ్రీరామ రక్ష. పోషక విలువలతో కూడిన భోజనం తీసుకోవాలి. యాంటీబాడీలు పెంచుకోవాలి. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించాలి.
మహారాష్ట్రలో 40శాతం మందిలో యాంటీబాడీస్
ప్రస్తుతం మహారాష్ట్రలోని 40శాతం జనాభాలో యాంటీబాడీస్ తయారయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా అంతానికి ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. మహారాష్ట్రంలో మే రెండో వారంలోగా కరోనా కేసులు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని యాంటీబాడీస్ పెంచుకోవాలి.
రుచి, వాసన పోతుంది…
కరోనా సోకిన వారిలో ముందుగానే రుచి, వాసన పోతుంది. ముక్కు, గొంతులో పలుచని నరాలు ఉంటాయి. వైరస్ సోకిన వ్యక్తి ముక్కు రంధ్రాలు, గొంతులోని పలుచని నరాలు పనిచేయవు. దీంతో వాసన పూర్తిగా కోల్పోతారు. అయితే ఇదంతా దగ్గు, జలుబు, జ్వరం లేకుండా వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో ఉండే లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే హోం ఐసొలేషన్లోకి వెళ్లాలి. డాక్టర్ను సంప్రదించి మందులు తీసుకోవాలి.
కంటిచూపు తగ్గుతుంది
కరోనా బారిన పడి వెంటిలేషన్పై ఉన్న కొందరికి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. దీన్ని కంటిలో ఉండే సన్నని నరాలు తట్టుకోలేవు. దీంతో కంటి చూపు మందగిస్తుంది. పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. గత నాలుగు రోజుల కిందట నగరంలోని ఒక ప్రైవేటు దవాఖానలో ఈ విషయం బయటపడింది. అయితే కొంత మందిలో కనురెప్పలపై బొబ్బలు, విపరీతమైన నొప్పి వస్తుందని డాక్టర్లు గుర్తించారు.