సూర్యాపేట టౌన్, జూన్ 27 : ప్రజారోగ్య పరిరక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని.. కొవిడ్ నివారణలో ఆయన ముందస్తు చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలోని ఆస్ట్రిన్కు చెందిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కళాశాలకు రూ. 10 లక్షల విలువగల మూడు రకాల క్లీనింగ్ మిషన్లు బహూకరించారు. వారి తరఫున స్థానిక నిర్మాణ్ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి వాటిని మంత్రి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రాధాన్యతను కొవిడ్ సమయంలో ప్రజలు గుర్తించారన్నారు. కొవిడ్ పేషెంట్ల ప్రాణాలను కాపాడడంలో మెడికల్ కళాశాలల పాత్ర అనిర్వచనీయమైనదన్నారు. నూతన మెడికల్ కళాశాలల్లో అన్ని వసతులతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ఇతర దేశాల్లో స్థిరపడిన వారు తమ ప్రాంతంపై ప్రేమాభిమానాలతో అనేక రకాల సేవలు, సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎన్ఆర్ఐలు అందించిన రైడ్ ఆన్ స్ర్కైబర్, ప్లిప్పర్, హైజెట్ ప్రెజర్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, డాక్టర్లు గిరిధర్ నాయక్, సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్రెడ్డి, కీసర వేణుగోపాల్ రెడ్డి, గుండపునేని కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.