సూర్యాపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కొద్దినెలలుగా కలెక్టర్తో సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. దీంతో పల్లె ప్రకృతి వనాలు మూడునెలల క్రితం వరకు 60శాతానికి మించకపోగా నేడు 679చోట్ల వందశాతం పూర్తి కావడం గమనార్హం. ఉపాధి హామీ పనుల్లో గతేడాది జిల్లా రాష్ట్రంలో టాప్ టెన్లో ఉండగా ఈసారి 23 మండలాల్లోని 475పంచాయతీల్లో అత్యధికంగా 87,276 మంది కూలీలు పనిచేసి టాప్లో నిలిచింది. హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలు కూడా 475 పంచాయతీలతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో టార్గెట్ను మించి పెంచుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్ ఎరువు తయారీ, వైకుంఠధామాలు దాదాపు 80శాతం పూర్తి కాగా, పంటకల్లాల నిర్మాణాల్లోనూ జిల్లా టాప్ ఫైవ్లో ఉంది.
ఆకస్మిక పర్యటనలతో సత్ఫలితాలు
జిల్లాలో ఉన్నతాధికారులు ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు, విరివిగా పర్యటనలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. రెండునెలల క్రితం మునగాల మండల తిమ్మారెడ్డిగూడెంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థల వివాదం నెలకొనగా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నేరుగా వెళ్లి సమస్యను పరిష్కరించారు. నాలుగైదు నెలలుగా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు మోహన్రావు, పద్మజారాణి, డీఆర్డీఓ కిరణ్కుమార్, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డిలతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఆర్డీఓ, తాసీల్దార్లు ఉదయం 8గంటలకే గ్రామాలకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. వెనుకబడిన పనుల విషయంలో సంబంధిత అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేస్తుండడంతో పనులు చకచకా సాగుతున్నాయి.
భూ సమస్యలకు మోక్షం..
అదనపు కలెక్టర్ మోహన్రావు ఆధ్వర్యంలో మూడు నెలల్లో జిల్లాలో 47 వివాదాస్పద భూముల సమస్యలకు మోక్షం కలిగింది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామాల్లో భూ సమస్య తీరి పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు చకచకా పూర్తవుతున్నాయి. ఇంతకముందు పల్లె ప్రకృతి వనాల విషయంలో రాష్ట్రంలో టాప్ 15లో ఉండగా నేడు వందశాతం పూర్తిచేసి టాప్లోకి చేరడం గమనార్హం.
బాధ్యత పెరిగింది..
ఉన్నతాధికారులంతా గ్రామాల బాట పట్టడంతో అందరిలో బాధ్యత పెరిగింది. కొద్దినెలల క్రితం వరకు అభివృద్ధి పనుల విషయంలో జిల్లా టాప్ టెన్ నుంచి 15వరకు ఉండగా నేడు పలు అంశాల్లో టాప్లో ఉంది. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటుండడంతో ఖచ్చితమైన మార్పు కనిపిస్తున్నది.