ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ
పార్టీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న ఆయా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
నమస్తే తెలంగాణ, నెట్వర్క్: టీఆర్ఎస్ పార్టీ ఇంతింతై వటుడింతై అన్నచందంగా 2001 నుంచి నేటివరకు 20 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. 2001 ఏప్రిల్ 27న ఉద్యమ సంస్థగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రస్థానం.. కాలానుగుణంగా రాజకీయ పార్టీగా అవతరించింది. నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నాటి నుంచి నేటివరకు టీఆర్ఎస్తో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆయా నాయకులు, కార్యకర్తలు, వ్యక్తులు ‘నమస్తే తెలంగాణ’తో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఊహించిన దానికంటే మంచి పరిపాలన
హాలియా, ఏప్రిల్ 26 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. ఉద్యమ సమయంలో మేము ఉహించిన దానికంటే ఎన్నో రెట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణగాలో గొప్ప సుపరిపాలన కొనసాగుతున్నది. దళారీ వ్యవస్థ లేదు.. జవాబుదారిపాలన ప్రజలకు అందుతున్నది.
ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి,
కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు
నీళ్లు.. నిధులు, నియామకాల కోసమే..
శాలిగౌరారం, ఏప్రిల్ 26 : సమైక్యాంధ్ర పాలనలో విసిగి వేసారిన ప్రజానీకానికి బంగారు తెలంగాణ పాలనను అందించాలనే ఉద్దేశంతో 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు అందాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు అందడంలో అప్పటి పాలకులు చూపిన వివక్ష కారణంగానే ఉద్యమంలో పనిచేశా. నేడు తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.
ఐతగోని వెంకన్నగౌడ్,
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, శాలిగౌరారం
కేసీఆర్ నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్రం
తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకూ పార్టీ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. హైదరాబాద్ పీజీ క్యాంపస్లో చదువుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపు మేరకు కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. నేడు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది.
చవ్వా వెంకట్రెడ్డి, తిరుమలగిరి గ్రామం
జలసాధన ఉద్యమం టీఆర్ఎస్ వైపు నడిపించింది
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 26 : ఎస్ఎల్బీసీ సాధనలో భాగంగా జలసాధన సమాఖ్యలో పనిచేస్తున్న క్రమంలో 2001 కేసీఆర్ పార్టీ పెట్టడంతో టీఆర్ఎస్లో చేరాను. 2002 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాను. ఉద్యమ సమయంలో యువతను, విద్యార్థులను ఏకంచేసి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించాం. 2004లో కేసీఆర్ను మండలానికి పిలిపించి అక్కంపల్లి, అంగడిపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించాం. జలసాధన సమితిలో ఎస్ఎల్బీసీలో నీటి వాటాల విషయంలో కేటీఆర్, ఈటల రాజేందర్ను పుట్టంగండి ప్రాంతానికి తీసుకొచ్చాం.
దొడ్డి లక్ష్మయ్య, తిరుమలగిరి గ్రామం
కల సాకారమైంది
చిట్యాల, ఏప్రిల్ 26 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లివచ్చాను. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శిగా, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఉద్యమకాలంలో కేసీఆర్ పిలుపు మేరకు చురుగ్గా పాల్గొన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైంది.
పల్లపు బుద్ధుడు, ఉరుమడ్ల
ఇవి కూడా చదవండి
కర్ణాటకలో రెండు వారాల లాక్డౌన్
వీరయ్య మరణవార్త ఎంతో కలచివేసింది: చిరంజీవి