పెన్పహాడ్, జూన్ 24 : ఎకరం భూమిలో రైతులు లక్ష రూపాయల ఆదాయం సాధించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని గాజుల మల్కాపురంలో కేవీకే రైతుమిత్ర ఆధ్వర్యంలో గురువారం వంద కాడెడ్లతో నిర్వహించిన ఏరువాక పూర్ణిమ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అరక దున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడి రైతులకు ఏరువాక పౌర్ణమి జరుపుకునే మహాభాగ్యం తెలంగాణ ఏర్పడ్డాకే కలిగిందన్నారు. 2014కు ముందు వరుస కరువు, ఆకలి చావులు, ఆత్మహత్యలతో తెలంగాణ ప్రాంతం దుర్భిక్షంతో ఉండేదని, స్వరాష్ట్రం వచ్చాకే సుభిక్షంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేయడం తెలంగాణ ప్రాంత రైతుల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఫలితంగా వరి ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్, కేరళ రాష్ర్టాలను మించి నేడు తెలంగాణ రికార్డు సాధించిందని చెప్పారు. గత పాలనలో వ్యవసాయం దండుగ అయితే.. ఇప్పుడు పండుగలా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మూస పంటలకు స్వస్తి పలికి అంతర పంటలపై మొగ్గు చూపితే సీఎం కేసీఆర్ కోరుకున్నట్టు ఎకరాకు లక్ష రూపాయలు సంపాదించడం కష్టమేమీ కాదని మంత్రి సూచించారు.
వాణిజ్య పంటలపై దృష్టి పెట్టండి
వరుస కరువుతో అల్లాడిన తెలంగాణ నేల ఇప్పుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని చీదెళ్ల, దూపాడ్ గ్రామాల్లో రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. మూస పద్ధతికి స్వస్తి పలికి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. సాగు పద్ధతులపై అవగాహన పెంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మించారని తెలిపారు. అంతర పంటల సాగులో భాగంగా చేపల పెంపకం, వేరుశనగ, పామాయిల్, ఆకు కూరలు, పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం గడించవచ్చని సూచించారు. తాము ఇప్పటికే అంతర పంటలు వేస్తున్నామని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నామని కొందరు రైతులు చెప్పగా.. మంత్రి వారిని అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు, వైస్ చైర్మన్ వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, అనంతుల శ్రీనివాస్గౌడ్, డీఏఓ రామారావునాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, మండల కన్వీనర్ పొదిల నాగార్జున, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నాతాల జానకీరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, ఏఓ కృష్ణసందీప్, డీఈఈ మనోహర్, ఏఈ గోపి, ఎంపీటీసీ జూలకంటి వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
చిరంజీవి సేవలు అభినందనీయం
సూర్యాపేట టౌన్ : సినీ హీరో చిరంజీవి ప్రజలకు తనదైన శైలిలో సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంక్లను ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, మా ర్కెట్ చైర్పర్సన్లు పెరుమాళ్ల అన్నపూర్ణ, ఉప్పల లలితా ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పెద్దిరెడ్డి రాజా, అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు నంద కిశోర్, ఎండీ అయూబ్ ఖాన్, ఖదీర్, రాంరెడ్డి పాల్గొన్నారు.