అన్ని సరిహద్దు చెక్పోస్టుల్లో రాకపోకలు నిషేధం
తెలంగాణలోకి రావాలంటే ఈ-పాస్ తప్పనిసరి
అత్యవసర సర్వీసులకే అనుమతి : ఎస్పీ భాస్కరన్
సూర్యాపేట సిటీ/ కోదాడ రూరల్, మే 22 : అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలు కఠినతరం చేశామని, ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. జిల్లాలోని ఆంధ్రా – తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ మినహాయింపు సమయంలో కొంతమంది అనవసరంగా సరిహద్దులు దాటుతున్నారన్నారు. అంధ్రా నుంచి అనుమతి లేకుండా ఉందయం వేళలో రామాపురం ఎక్స్ రోడ్డు చెక్పోస్టు నుంచి తెలంగాణలోకి వస్తున్నారని, దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అందుకే ఆంక్షలను కఠినతరం చేశామని చెప్పారు. జిల్లాలోని 4 అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రెడ్లకుంట, చింతలపాలెం, మట్టంపల్లి సరిహద్దులను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. అక్కడ అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఉంటాయన్నారు. రామాపురం క్రాస్రోడ్డు వద్ద చెక్పోస్టు 24 గంటలూ ఉంటుందని, అక్కడ ఈ-పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ-పాస్ ఉండాల్సిందేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటల వరకు కార్యాలయాలకు చేరుకోవాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే చలానాతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి సూచించారు. లాక్డౌన్ అమలుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ రఘు, రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ వై.సైదులు, సిబ్బంది ఉన్నారు.