సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మనకు వైద్య కళాశాలలు
కరోనా వేళ దాతృత్వం స్ఫూర్తిదాయకం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట మెడికల్ కాలేజీకి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు దాత ఎన్ఆర్ఐ
మహేందర్రెడ్డికి మంత్రి అభినందనలు
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే సూర్యాపేట, నల్లగొండలో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం కరోనా వేళ అవి అనేకమంది ప్రాణాలను నిలుపుతున్నాయి. మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు పొందుతున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో పౌరులు, సంస్థలు, సంఘాల భాగస్వామ్యం, దాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ మహేందర్రెడ్డి శనివారం పేట మెడికల్ కాలేజీకి అందించిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి ప్రారంభించి, ఆయన్ని అభినందించారు. మనోధైర్యమే కరోనాకు మందు అని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని సూచించారు.
సూర్యాపేట, మే 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో నెలకొల్పిన మెడికల్ కశాశాలలు కరోనా పేషెంట్ల ప్రాణాలు నిలుపుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కరోనా రెండో దశ ఉధృతమవుతున్న వేళ ప్రాణ వాయువును అందుబాటులో ఉంచడానికి సూర్యాపేట జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కళాశాలకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బహూకరించారు. వాటిని శనివారం సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రాంగణంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై చేసే పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరి దాతృత్వం వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యక్తిగతంగా కొందరు ఇతోధికంగా సహాయ పడడానికి ముందుకు రావడాన్ని మంత్రి అభినందించారు. ఉమ్మడి జిల్లాలో మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఆస్పత్రులు ప్రాణదానం చేస్తుంటే వాటి ప్రాశస్త్యాన్ని ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు ఆలోచనలే కారణమని కొనియాడారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే జరుగుతున్నదని, కరోనా లక్షణాలుంటే అక్కడికక్కడే మెడికల్ కిట్లు అందజేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉందని వెల్లడించారు. కొవిడ్ సోకినంత మాత్రాన భయపడొద్దని, మానసిక ధైర్యమే కరోనాకు మందు అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది పనితీరును ప్రశంసించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మెడికల్ సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.