2,60,333 జాబ్ కార్డులు
సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీల పరిధిలో 2,60,333 జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 6,06,091 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,78,033 జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 3,55,983 మంది సభ్యులు రోజూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు. కరోనా కారణంగా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండి సొంత గ్రామాలకు వచ్చిన వారికి కొత్తగా ఉపాధి కార్డులు మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 12,956 కుటుంబాలకు కొత్తగా జాబ్కార్డు ఇవ్వగా 34,537 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి భత్యం ఇస్తున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం అదనంగా చెల్లించారు. ఉపాధి పనులు జరిగే చోట ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు.
గతేడాది 65.66 శాతమే
2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 1,17,64,000 ఉపాధి పనులు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 77,24,000 (65.66 శాతం) పనులు మాత్రమే చేయగలిగారు. దీనికి కారణం గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు కృష్ణా, మూసీ, గోదావరి జలాలు రావడంతో వ్యవసాయం పనులు జోరుగా సాగాయి. అంతే కాకుండా 475 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనుల నిమిత్తం నిర్వహించిన గ్రామ సభల్లో 70 లక్షల పనిదినాలు కల్పించాలని కోరారు. కానీ కరోనా వల్ల అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని దినాలను పెంచింది. దీంతో అనుకున్న లక్ష్యం పెరుగడంతో అది చేరుకోలేదు. రూ.103.65 కోట్ల ఉపాధి కూలీలకు పని కల్పించడం ద్వారా పనుల కోసం ఉపయోగించిన మెటీరియల్కు రూ. 68.78 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.172.43 కోట్లు వెచ్చించారు. 1,64,945 కుటుంబాలకు పని కల్పించగా 3,13,764 మంది కూలీలు హాజరవుతున్నారు. సగటున ఒక కూలీకి రూ.140.12 చెల్లించారు. 12,631 మంది వంద రోజులపాటు పనిచేశారు.
లక్ష్యం చేరుకునేలా పనులు
ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నాం. కరోనా వల్ల అనేక మంది సొంత గ్రామాల్లోనే ఉంటున్నారు. వారికి సైతం పనులు కల్పిస్తున్నాం. కరోనా జాగ్రతలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేయిస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వం ఇచ్చిన పనుల లక్ష్యాన్ని చేరుకుంటాం.