నేరేడుచర్ల/పాలకవీడు/మునగా ల/ చివ్వెంల/దేవరకొండ, మే 16 : అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. నేరేడుచర్లలో తెల్లవారుజాము నుంచే మబ్బులు కమ్మేశాయి. ఉదయం 8.30గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురువడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. అలాగే పాలకవీడు, మునగాల మండలాల్లోని పలుగ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చివ్వెంల మండలంలోని పలు ఐకేపీ కేంద్రాలు, దేవరకొండ పట్టణంలోని మార్కెట్లో ధాన్యం తడువగా, కొంతమంది రైతులు ముందస్తుగా ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పి ఉంచారు. తుఫాన్ ప్రభావంతో వాతావరణం చల్లబడింది.
పిడుగు పడి ఇద్దరు మృతి
నూతనకల్/ఆత్మకూర్.ఎస్ : మిరపతోటలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని లింగంపల్లిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు బయ్య వెంకన్న మిరపతోటలో ఆరుగురు కూలీలు మిరపకాయలు ఏరుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో పక్కనే ఉన్న వేపచెట్టు కిందికి వెళ్లారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగుపడింది. దీంతో వీరబోయిన భిక్షం(70), కారింగుల ఉమ(36)అక్కడికక్కడే మృతి చెందారు. బయ్య లింగమ్మ, పేర్ల నీలమ్మ, ఉప్పుల నాగమ్మ, బయ్య సిద్ధుకు గాయాలవగా సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తుంగతుర్తి దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. అలాగే ఆత్మకూర్.ఎస్ మండలం మిడతనపల్లిలో పిడుగు పడి ఇద్దరు గాయపడ్డారు. గ్రామానికి చెందిన బయ్య రమక్క, బయ్య లక్ష్మి అత్తాకోడళ్లు మిరప తోటలో మిరపకాయలు ఏరుతున్నారు. ఈ సమయంలో మబ్బులు కమ్మడంతో ఏరిన మిరపకాయలపై పట్టాలు కప్పుతుండగా పిడుగుపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఐదు పశువులు, బర్రె మృతి
పెన్పహాడ్ : మండలంలోని జల్మల్కుంటతండాలో ఆదివారం వీచిన గాలికి బావిగడ్డపై ఉన్న తాటిచెట్టు కూలి కరెంట్ లైన్పై పడింది. దీంతో స్తంభాలు కూలి తీగలు కిందపడడంతో విద్యుత్షాక్తో ఐదు పశువులు, ఒక బర్రె అక్కడికక్కడే మృతి చెందాయి. లావుర్యాకు చెందిన మూడు ఆవులు(రూ.60వేలు), ధరావత్ సుధాకర్కు చెందిన రెండు కోడెదూడలు(రూ.50వేలు), నునావత్ జానకీరాముడికి చెందిన బర్రె(రూ.40వేలు)మృతి చెందినట్లు సర్పంచ్ ధరావత్ రేచల్నాగేందర్ తెలిపారు. బాధిత గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.