సూర్యాపేట/హాలియా, మార్చి16 : నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు శాసన సభ నివాళులర్పించింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. నర్సింహయ్య సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. నోములతో తమకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్న అనంతరం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, రవీంద్రకుమార్ మాట్లాడుతూ నర్సింహయ్యకు నివాళులర్పించారు. సంతాపం తెలుపుతూ సభ్యులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన వ్యక్తి నర్సింహయ్య అన్నారు. సాయుధ పోరాటానికి కొనసాగింపుగా, నర్రా రాఘవరెడ్డి
ఆశయాలను పుణికి పుచ్చుకుని నల్లగొండ జిల్లాలో భూస్వామ్య, పెత్తందారీ వ్యతిరేక ఉద్యమాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటిసారిగా సూర్యాపేటలో కలిసినప్పుడు కమ్యూనిస్టు పార్టీ వైఖరిపై పత్రికల్లో తాను రాసిన వ్యాసంపై మాట్లాడుతూ.. పార్టీలో చర్చిస్తే సమాధానం చెప్పలేక చర్చించ వద్దంటూ ఎజెండా నుంచి అంశాన్ని తొలగించారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నేను ఏదో ఒక రోజు కలిసి వస్తానని సార్కు చెప్పండని అన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నోములను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే 2018 ఎన్నికల్లో గెలిచారన్నారు. వ్యక్తిగతంగా తనతో సన్నిహితంగా ఉండేవారని, వ్యవసాయం అంటే ఆయనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. రైతాంగానికి వ్యవసాయంలో లాభం వచ్చేలా చేయాలని తరుచూ చెప్పేవారన్నారు. దురదృష్టవశాత్తు అందరినీ వదిలి వెళ్లిపోయారని ఆవేదన చెందారు.
నోముల నర్సింహయ్య మృతి దురదృష్టకరం. బడుగు, బలహీన వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ఆయనతో కలిసి పాల్గొనే అవకాశం కలిగింది. నోముల నర్సింహయ్య శాసనసభా పక్షనేతగా వ్యవహరించిన తీరు గొప్పగా ఉండేది. ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం శ్రద్ధగా ఆయన మాటలు విని సమాధానమిచ్చేవారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని రెండేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారు.
– రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే, దేవరకొండ
బడుగు బలహీన వర్గాలు, రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు నర్సింహయ్య. సమస్యలపై ఆయన గళం విప్పుతున్నారంటే జనం టీవీలకు అతుక్కుపోయేవారు. సమస్యలపై ధైర్యంగా మాట్లాడే గొంతుక నోముల. జిల్లాలో బీసీలు, రైతుల పట్ల నోముల పోరాటం మరువలేనిది. సాగర్లో లిఫ్టుల ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు.
-చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్యెల్యే
నోముల నర్సింహయ్య క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ప్రజల గొంతుకై ఉద్యమాలకు సారథ్యం వహించి చట్టసభల్లోకి ప్రవేశించి మన్ననలు పొందారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ వాటి పరిష్కారం కోసం విశ్రాంతి లేకుండా పోరాడిన వ్యక్తి నోముల. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నోముల ప్రస్తుతం లేకపోవడం బాధాకరం.
– బొల్లం మల్లయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే