అబ్దుల్లాపూర్మెట్ దగ్గర లారీని ఢీకొట్టిన కారు
సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలు
నాగులపాటి అన్నారం, కొండాయిగూడెంలో విషాదఛాయలు
పెన్పహాడ్, మే 8 : హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ దగ్గర శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ దంపతులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన సుందరి లక్ష్మణ్(39) హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అత్తగారి గ్రామం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో జరిగిన రామాలయ పునఃప్రారంభం, ధ్వజ స్తంభారోహణ కార్యక్రమాలకు సతీమణి ఝాన్సీ(35)తో కలిసి హాజరయ్యారు. శుక్రవారం ఉదయాన్నే స్వగ్రామం నాగులపాటి అన్నారానికి వచ్చారు. ఆ రాత్రి వరకు తల్లితో గడిపి ఆదివారం ఉదయాన్నే విధుల్లో చేరడానికి కూతురు ఆకాంక్షను తల్లి వద్దనే వదిలి భార్య ఝాన్సీ, కొడుకు కుశలవ్తో కలిసి కారులో హైదరాబాద్కు బయలు దేరాడు. కాగా శుక్రవారం రాత్రి భార్యతో పాటు తన కుమారుడు కుశలవ్ కలిసి తన కారులో హైదరాబాద్కు బయలు దేరాడు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న కొడుకు కుశలవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ దంపతుల మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు.
సొంతూరులో విషాదఛాయలు..
సీఐ లక్ష్మణ్, ఝాన్సీ దంపతులు మరణ వార్త వినగానే ఆయన స్వగ్రామం నాగులపాటి అన్నారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్ తన తల్లిదండ్రుల ఆశయ సాధనలో భాగంగా పోలీస్ కావాలనే ఆకాంక్ష నెరవేర్చడం వెనుక తన కొడుకు ఎంతో కష్టాపడ్డాడని తల్లి కంటతడి పెడుతున్న తీరును అందరిని శోకసముద్రంలో నెట్టి వేసింది. కాగా సీఐ లక్ష్మణ్ దంపతుల మృత దేహాలకు పెన్పహాడ్ ఎస్ఐ శ్రీకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా లక్ష్మణ్ తండ్రి చిన్నతనంలో మృతి చెందాడు.
గరిడేపల్లి : లక్ష్మణ్ దంపతులు మృతి చెందారనే వార్త వినగానే కొండాయిగూడెంలో విషాదం నెలకొంది. మూడ్రోజులపాటు గ్రామంలో పిల్లలతో కలిసి వారు చేసిన సందడిని గ్రామస్తులు నెమరవేసుకున్నారు. వారిని చివరిసారిగా చూసేందుకు లక్ష్మణ్ సొంతగ్రామమైన అన్నారం గ్రామానికి కొండాయిగూడెం గ్రామస్తులు భారీసంఖ్యలో వెళ్లారు.