కట్టంగూర్(నకిరకల్), మే 7 : నకిరేకల్ మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్గా టీఆర్ఎస్కు చెందిన 11వ వార్డు కౌన్సిలర్ మురారిశెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ సమక్షంలో నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల్లో గెలుపొందిన 20 మంది కౌన్సిలర్లతో ఆర్టీఓ జగదీశ్వర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు.
3గంటలకు ఎన్నికల అధికారి నల్లగొండ ఆర్టీఓ జగదీశ్వర్రెడ్డి కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం 3.30గంటలకు చైర్మన్, వైస్చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఆల్ఇండియా ఫార్వడ్ బ్లాక్, కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఎన్నిక లాంఛనమైంది. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి
నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు కృషి చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నిక అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంత్రావు, బడుగుల లింగయ్యయాదవ్, మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నకిరేకల్ పట్టణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమనే నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారని, అందుకు అనుగుణంగా సేవలందించాలని పాలకవర్గం సభ్యులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా నకిరేకల్ మున్సిపాలిటీ రూపురేఖలు మార్చుతామని మంత్రి తెలిపారు.