నల్లగొండ, ఏప్రిల్ 30: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద గోదాముల్లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఎన్నికల పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సిబ్బందికి రెండు సార్లు శిక్షణ ఇచ్చామని నేడు మాక్ కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా రాజకీయ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్ టెస్ట్ చేసి నెగెటివ్ వస్తేనే అనుమతించనున్నట్లు తెలిపారు.
రెండోరోజూ కరోనా పరీక్షలు
నిడమనూరు : కౌంటింగ్కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు రెండోరోజూ కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి వేర్హౌసింగ్ గోదాంలో మే 2 న జరుగనున్న లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లకు పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిడమనూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారి రోహిత్సింగ్ పర్యవేక్షణలో గురువారం ఏర్పాటుచేసిన శిబిరంలో 108మందికి పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. రెండోరోజు శుక్రవారం 100మందికి పరీక్షలు నిర్వహించగా 9మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ మాధవ్కుమార్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు జిల్లా కేంద్రంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు.