కోదాడ రూరల్, డిసెంబర్ 21 : కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు 750 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వేలాది ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు, పట్టణవాసుల దాహార్తి తీరుస్తున్నది. పట్టణంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువు శిఖం భూములపై రియల్టర్ల కన్ను పడింది. నలుమూలలా కొందరు యథేచ్ఛగా ఆక్రమించడంతో విస్తీర్ణం ప్రస్తుతం 400 ఎకరాలకు తగ్గింది. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణల విషయం రాష్ట్రస్థ్ధాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో సమగ్ర సర్వేకు నిర్ణయించినట్లు తెలిసింది. చెరువును సర్వే చేసేందుకు బుధవారం కోదాడకు రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు రానున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాంతో చెరువు శిఖం భూమి ఆక్రమణదారుల చెర వీడనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2009లో కలెక్టర్కు ఫిర్యాదు..
కోదాడ పెద్ద చెరువు అక్రమణపై 2009లో కొందరు సమాజ సేవకులు నాటి కలెక్టర్ రిజ్వీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఎఫ్టీఎల్ కొలతల ఆధారంగా ఆక్రమణ జరిగిందని గుర్తించి దాదాపు 100 మందికిపైగా నోటీసులు జారీ చేశారు. విచారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి పంచాయతీ పరిధిలోని లేఅవుట్ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. కానీ స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కొందరు చెరువు భూముల ఆక్రమణకు పాల్పడుతుండడంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం దృష్టిసారించింది. ఆక్రమణ నిగ్గు తేల్చేందుకు బుధవారం రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
సమన్వయ లోపం..
రామిరెడ్డిపాలెం రోడ్డులో చెరువు శిఖం భూమిని ఆక్రమించిన కొందరు దర్జాగా ఫెన్సింగ్ వేస్తున్నారు. నిత్యం అదే దారిలో వెళ్లే మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఆక్రమణను పట్టించుకోకపోవడం గమనార్హం. చెరువు పరిధి భూములు రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల పరిధిలో ఉండడంతో ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు నెపం మోపుతూ చేతులు దులుపు కుంటున్నారు.
సక్రమం పేరుతో ఆక్రమణ..
ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీనవర్గ ప్రజలు చెరువు శిఖంలో సాగు చేసుకునేందుకు మునక, ఏక్సాల్ పట్టా ఇచ్చారు. నీరు లేనప్పుడు చెరువు శిఖంలో వ్యవసాయం చేసుకోవచ్చని, నిండినప్పుడు వదిలేయాలనేది నిబంధన. దీనిని సాకుగా చూపించి ఎఫ్టీఎల్లోకి వచ్చిన భూ బకాసురులు మట్టిని తోలి ఆక్రమణకు పాల్పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు, ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా ఆక్రమణకు పాల్పడుతున్నా స్థ్ధానిక అధికారులు మిన్నకుండా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొందరు చెరువు శిఖంలోని నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారుల ఆటకట్టించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
హద్దులు ఏర్పాటు చేయాలి
పట్టణంలోని పెద్ద చెరువుకు అధికారులు హద్దులు ఏర్పాటు చేయాలి. గత పాలకులు, అధికారులు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులోని ఎన్ఎస్పీ కాల్వ భూముల ఆక్రమణపైనా అధికారులు సర్వే చేయాలి.
ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది
రామిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డులోని చెరువు శిఖం భూమి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. అక్కడ భూమి ఆక్రమణకు గురైన విషయం మా దృష్టికి రాలేదు. త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, నీటి పారుదల అధికారుల సమన్వయంతో పనిచేసి ఆక్రమణలను అడ్డుకుంటాం. ఆక్రమణ దారులను వదిలిపెట్టబోం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
ఆక్రమణలను ఉపేక్షించేది లేదు
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. కోదాడ పెద్ద చెరువు భూముల ఆక్రమణను ఉపేక్షించేదిలేదు. అధికారుల ఆదేశాల ప్రకారం ఆక్రమణలు తొలగించి త్వరలో ట్యాంక్బండ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. బోటింగ్ ఏర్పాటుతో పర్యాటక కేంద్రంగా మారుస్తాం.