సూర్యాపేట : వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy ) కోరారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, బానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా ( Review ) లో మంత్రి పాల్గొన్నారు.
ఈ నెల 18న వినాయక చవితి, 27న నిమజ్జన తేదీలుగా నిర్ణయించారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణహిత ( Environmental ) గణేశ్ విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పీవోపీ విగ్రహాలలో వాడే రసాయనాల ద్వారా నీటితో సహా పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుంది అన్నారు. మండపాలు, ఇండ్లలోనూ పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజించాలని కోరారు. దీనివల్ల అనేక రోగాలు వ్యాపించడంతోపాటు నీటిలో జీవించే జల రాశులకు కూడా ప్రాణాపాయం పొంచి ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మండపాల ఏర్పాటుకు పోలీసు, సౌండ్ స్టిమ్, లైటింగ్, తదితర వసతులకు ముందస్తుగా అనుమతి పొందాలని సూచించారు. సద్దుల చెరువులో గణేష్ నిమజ్జనం (Immersion ) ఉంటుందని, అందుకనుగుణంగా ఆయా విగ్రహాలను నిమజ్జనం కొరకు తరలించేందుకు ట్రాఫిక్ ( Traffic ) అంతరాయం కలుగకుండా రూట్మ్యాప్ సిద్ధం చేయాలని, పోలీసు అధికారులకు ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాలలో పారిశుధ్యం, త్రాగునీరు, లైటింగ్, బారికేడింగ్, నిమజ్జన ప్లాట్ఫామ్స్ క్రేన్స్ తదితర ఏర్పాట్లను మున్సిపల్ , రెవెన్యూ శాఖ ల ద్వారా చేపట్టాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జిల్లా గ్రంథాలయ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.