ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికం. అదునుకు వర్షాలు కురువడంతో పత్తి సాగు ఆశాజనకంగా ఉంది. పైర్లు పలు దశల్లో ఉండగా అక్కడక్కడా వరుస వర్షాలతో ఎదుగుదల లోపించింది. మరికొన్ని ప్రాంతాల్లో జాలు వారి, గడ్డి ఏపుగా పెరిగింది. ఈ క్రమంలో పంట ఎదుగుదల లోపించకుండా, తెగుళ్ల బారిన పడకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఎండు తెగులు సోకితే…
ఎండుతెగులు ఆశించిన మొక్క వేరును నిలువుగా చీల్చి చూస్తే లోపల ఎర్రటి చారలు కనిపిస్తాయి. దీన్ని బట్టి పత్తికి ఎండుతెగులు ఆశించినట్లు తెలుసుకోవచ్చు. అయితే తెగులు ఆశించిన తొలి దశలోనే ఈ ఎర్రటి చారలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. మొక్కలు వడలినట్లుగా కనిపించగానే నివారణ చర్యలు చేపట్టాలి. పూర్తిగా లేక 75శాతం వరకు ఎండిన మొక్కలను పీకి కాల్చివేయాలి. లేకుంటే వీటి ద్వారా తెగులు మిగతా మొక్కలకు వ్యాపించే ప్రమాదం ఉన్నది. నీరు నిలిచిన నేలల్లో పోషకాలను మొక్కలు గ్రహించలేవు. ఆకులపై ఎరువులను పిచికారీ చేసి ఏపుగా పెంచవచ్చు.
20గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని పొటాషియం నైట్రేట్(మల్టీకే) 10గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
10గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను కూడా కలిపి వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పత్తి ప్రస్తుత దశలో ఎకరాకు 30-35 కిలోల యూరియా 15కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ కలిపి మొక్కలకు 10సెంటీ మీటర్ల దూరంలో 5.7సెంటీ మీటర్ల లోతులో వేసి మట్టిని కప్పాలి. l ఎరువు వేసే ముందు కలుపును పూర్తిగా నివారించాలి. l కలుపు 3-4ఆకుల దశలో ఉంటే ఎకరాకు 400మిల్లీ లీటర్లు క్వీజల్పాప్ ఇథైల్ 250మి.లీటర్లు ఫైరి థియోబాక్ సోడియం కలిపి పిచికారీ చేయాలి.
మొక్కలు బాగా పెరిగి 3-4ఆకుల దశ దాటి ఉంటే ైగ్లెఫోసేట్ 10మిల్లీ లీటర్లు, 10గ్రాముల యూరియాను లీటర్ నీటికి కలిపి కేవలం వరుసల మధ్య కలుపు మొక్కలపై మాత్రమే పడేలా చల్లాలి.
మొక్కలకు దగ్గరగా ఉన్న కలుపును కూలీలతో తీయించాలి.
నీరు నిలిస్తే…
పత్తి చేలల్లో నీరు నిలిస్తే మొక్కల ఎదుగుదల దెబ్బ తింటుంది. తేమ అధికంగా ఉండడం వల్ల ఎండు తెగులు సోకే ప్రమాదం ఉన్నది. నేలలోని శిలీంధ్రం పత్తి మొక్క వేర్లను ఆశించడం వల్ల ఎండు తెగులు వస్తుంది. దీనిని రైతులు తొలి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఎండు తెగులు ఆశించిన మొక్కలను గుర్తించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని స్ప్రేయర్ నాజిల్ తీసి మొదళ్లలో పోయాలి.
తెగుళ్ల నివారణకు..
ప్రస్తుతం పత్తి పైరును రసం పీల్చే పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు మోనోక్రొటోఫాస్ పత్తి మొక్క కాండంపై మధ్య భాగంలో రెండు అంగుళాలు పొడవునా ఒకవైపు మాత్రమే పూయాలి. దీనినే కాండానికి బొట్టుపెట్టే పద్ధతిగా వ్యవహరిస్తారు. బొట్టు పెట్టడానికి చిన్నబ్రష్ కూడా దొరుకుతుంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
ఈ సీజన్లో వర్షాలు సకాలంలో పడడంతో పత్తి చేలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే గత వారం కిందట ముసురు కురవడం వల్ల పంటకు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉన్నది. ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.