‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పేద విద్యార్థులకు వరంలాంటిది.. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఇంగ్లిష్ మీడియం ఉచితంగా అందించడం గొప్ప విషయం. దాంతో పోటీ పరీక్షలతో పాటు ఇతర రంగాల్లో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తద్వారా పేదరికాన్ని కూడా దూరం చేయవచ్చు’అని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ‘మన ఊరు-మనబడి అమలు నేపథ్యంలో నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు.
‘ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడంతో పాటు సరికొత్త ఒరవడితో సర్కార్ బడులను బాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ‘మన ఊరు-మన బడి’కార్యక్రమాన్ని చేపట్టింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపర్చడంతోపాటు నాణ్యమైన ఆంగ్ల విద్య అందించడమే ఈ పథకం ఉద్దేశం. తొలి విడుతలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోవడం సంతోషదాయకం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,123 ప్రభుత్వ పాఠశాలలుండగా నల్లగొండ జిల్లాలో 1,484 పాఠశాలల్లో వసతులు మెరుగుపడుతాయి.’
‘పేద విద్యార్థులను సైతం పోటీ ప్రపంచంలో నిలబెట్టేందుకు ఇంగ్లిష్ మీడియం దోహదం చేస్తుంది. నిర్ణయం తీసుకున్న వెంటనే రూ.7,289 కోట్లను మంజూరు చేయడం ప్రభుత్వ విద్య బలోపేతంపై సీఎం కేసీఆర్సార్ అంకితభావానికి నిదర్శనం. కరోనా కారణంగా రెండేండ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, హాజరుశాతం పెరిగింది. ఈ నేపథ్యంలో మన ఊరు.. మన బడి లాంటి కార్యక్రమాలతో మంచి ఫలితాలను చూడవచ్చు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన ఊరు.. మనబడి విజయవంతానికి అన్ని విధాలా కృషి చేస్తాం. గురుకులాల విషయంలో సక్సెస్ సాధించిన రాష్ట్ర ప్రభుత్వానికి మన ఊరు.. మన బడి లాంటి కార్యక్రమాన్ని అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కావడంతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది.