మఠంపల్లి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన మట్టపల్లిలో బుధవారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున సుప్రభాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆకు పూజ నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మండలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
పట్టువస్ర్తాలతో అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంతవైభవంగా కల్యాణతంతు నిర్వహించారు. అనంతరం భక్తులకు దైవదర్శనంతో పాటు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.