తిరుమలగిరి/సూర్యాపేట : మన ఊరు-మన బడి ఒక అద్భుత పథకం. దీని ద్వారా పాఠశాలలు బాగుపడం..నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి రానుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు పంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మన ఊరు – మన బడి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో మన ఊరు-మన బడిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మన ఊరు-మన బడి పథకం కి ఎంపిక కాబడిన పాఠశాలల మరమ్మతులు చేపట్టాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా మన ఊరు మన బడికి పాఠశాలలను సిద్ధం చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, నల్లగొండ డీఈవో బి.భిక్షపతి, యాదాద్రి భువనగిరి డీఈవో కె.నర్సింహ, సూర్యాపేట డీఈవో కె.అశోక్ తదితరులు పాల్గొన్నారు.