నిశ్చలంగా, నిస్సహాయంగా మంచానికి పరిమితమైపోయిన హరీశ్రాణా వైద్య పర్యవేక్షణలో మృత్యువు ఒడికి చేరాడు. పదమూడేండ్ల క్రితం ఆ యువకుడు నాలుగంతస్థుల హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి ఇక లేవలేదు. తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందాడు. తలకు బలమైన గాయం వల్ల కోమాలోకి వెళ్లాడు. అప్పటినుంచి మంచానికి పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు ఇంటిదగ్గరే అతనికి చికిత్స కొనసాగించారు. కృత్రిమంగా ఆహారం, నీరు ఎక్కించడం ద్వారా వైద్యులు అతడి ప్రాణాలు కొంతకాలం పాటు నిలిపారు. రోజురోజుకూ కృశించిపోయి నిరర్థక స్థితికి చేరుకొన్న హరీశ్కు కారుణ్య మరణం ప్రసాదించమని అతని తల్లిదండ్రులు సుదీర్ఘ న్యాయపోరాటమే చేశారు. 2024లో వారు వేసిన మొదటి కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ‘శ్వాస తనంతట తాను తీసుకోగలుగుతున్నాడు కనుక కారుణ్య మరణం కోసం అనుమతించలేం’ అంటూ రాణా తల్లిదండ్రు అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో హరీశ్ తల్లిదండ్రులు మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిట్టచివరకు ఈనెల 11న సుప్రీంకోర్టు అతనికి గౌరవప్రదమైన మరణాన్ని కల్పించాలని ఆదేశించింది. భారత న్యాయవ్యవస్థలో ఇదొక మైలురాయి తీర్పు. ఢిల్లీ ఎయిమ్స్ దవాఖాన వైద్యుల పర్యవేక్షణలో ప్రాణ రక్షక చికిత్సా వ్యవస్థను ఉపసంహరించిన తర్వాత ఈనెల 24న హరీశ్ అంతిమ శ్వాస విడిచాడు. న్యాయవ్యవస్థ అనుమతితో మన దేశంలో జరిగిన తొలి కారుణ్య మరణం ఇది.
‘కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం తీయడం తప్పనిసరి అవుతుంది. నిత్య నరకం అనుభవిస్తూ కోలుకొనే అవకాశాలు అడుగంటి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే దురదృష్ట జీవులకు మరణమే ఆశాకిరణమవుతుంది. వారికి ప్రశాంతమైన, గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించడం కనీస మానవధర్మం అవుతుంది’ అనే వాదన చాలాకాలంగా నలుగుతున్నది. దీనినే ‘కారుణ్య మరణం’ అని పరిగణిస్తున్నారు. ఇది బతుకుతారనే ఆశ ఏమాత్రం లేని రోగిని మృత్యువు ఒడిలో కావాలని చేర్చి నిద్రపుచ్చడం తప్ప మరోటి కాదు. అయితే ఆ మరణం ఎలా సాధ్యమవ్వాలి? మనంతట మనమే ఏదైనా వైద్యపరమైన చర్య ద్వారా రోగి చనిపోయేలా చేయాలా? దీనినే ‘సక్రియాత్మక కారుణ్య మరణం’ లేదా ‘యాక్టివ్ యూథనేషియా’ అని అంటున్నారు. వైద్య నిపుణుల సహాయంతో జరుగుతుంది కనుక దీనిని ‘అసిస్టెడ్ యూథనేషియా’ అని కూడా అంటున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యాక్టివ్ యూథనేషియా చట్టబద్ధంగానే అమలవుతున్నది. ‘నిష్క్రియాత్మక కారుణ్య మరణం’ లేదా ‘పాసివ్ యూథనేషియా’ అనేది దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్నది. ఇందులో ప్రాణాధార చికిత్సా వ్యవస్థ ఉపసంహరణ లేదా నిలుపుదల ద్వారా మరణం సంభవిస్తుంది. ఈ రెండో విధానం వైపే భారత్ మొగ్గుచూపింది. అయితే ఇప్పటివరకు ఇది అమల్లోకి రాలేదు. కాగా, మొదటిదైన సక్రియాత్మక కారుణ్య మరణాన్ని మనదేశం నేరంగా పరిగణిస్తున్నది. అంటే ఎవరైనా (అది వైద్యుడైనా కావచ్చు) ఆత్మహత్యలో సహకరిస్తే శిక్షార్హులవుతారు.
పాసివ్ యూథనేషియాలోనూ మెడికల్ బోర్డుల నివేదికలు తప్పనిసరి. హరీశ్ విషయంలో అతను యంత్రాల సాయంతో ఊపిరి తీసుకుంటున్నాడని, కోలుకొనే అవకాశాలేమీ లేవని రెండు బోర్డులూ తేల్చిచెప్పాయి. ఆ సిఫారసుల ఆధారంగానే సర్వోన్నత న్యాయస్థానం కారుణ్య మరణానికి అనుమతించింది. నిజానికి 2011లో అరుణా షాన్బాగ్ కేసులో కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బ్రెయిన్ డెడ్ కానందువల్ల ఆమెకు కారుణ్య మరణం కల్పించేందుకు అనుమతి నిరాకరించింది. దాంతో 2015లో ఆమె సహజ మరణాన్ని పొందింది. కాకపోతే అదే తీర్పులో పాసివ్ యూథనేషియాను సమర్థించడం విశేషం. కచ్చితంగా పాటించవల్సిన మార్గదర్శకాలను వెలువరించింది. ఇప్పుడు అవే మార్గదర్శకాల వెలుగులో హరీశ్రాణా కారుణ్య మరణానికి సుప్రీం అనుమతించడం, అతడు శాశ్వత నిద్రలోకి జారుకోవడం ఓ కీలకమైన మలుపుగా నిలిచింది.