సూర్యాపేట : శ్రీ కృష్ణుని చరితమే మానవ జీవన అనుభవసారమని, అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి శ్రీ కృష్ణుడు ప్రతిరూపమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.శ్రీ కృష్ణ (Sri Krishna) తత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సూర్యాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణం లో కృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు శ్రీకృష్ణ తత్వం ప్రతీక అన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధర్మం వైపే నిలబడాలన్న శ్రీ కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి పాటు పడాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmastami ) శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్మూర్తి యాదవ్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, నర్సయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.