సూర్యాపేట : జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధి రెండో వార్డ్ కౌన్సిలర్ రణపంగా నాగయ్య ఆదివారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో నాగయ్యతో పాటు కాంగ్రెస్ యూత్ నాయకుడు చింతలచెరువు సైదులుకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసే ఒక్కొక్కరు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రానున్న కాలంలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
హజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఇప్పటివరకు గెలిచిన రెండున్నర సంవత్సరాలలో రూ. 3,500 కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు చల్లా శ్రీలతా రెడ్డి, అరిబండి సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరు సైదులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశట్ల రమేష్ బాబు ఉన్నారు.