మరింత కట్టుదిట్టంగా ప్రణాళికలు
ప్రత్యేక యాప్ రూపకల్పన, లైవ్ ఫొటోస్తో జీపీఎస్ సిస్టం
యూనిట్ విలువ రూ.1.25 నుంచి రూ.1.75 లక్షలకు పెంపు
18 ఏండ్లు నిండిన వ్యక్తులు అర్హులు
హర్షం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు
నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వృత్తిదారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు. ఇప్పటికే తొలి విడుతలో పెద్ద సంఖ్యలో గొర్రెలను అందజేసిన ప్రభుత్వం రెండో విడుతకు సన్నద్ధమవుతున్నది. హుజూరాబాద్లో బుధవారం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా మన జిల్లాలోనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా ఎంపిక చేయనుండగా.. ఈ సారి యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా గొర్రెల కొనుగోలు మొదలు లబ్ధిదారుడి ఇంటికి చేరే వరకూ ప్రత్యేక యాప్లో నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు.
యాదవుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని రూపొందించింది. దీనిని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ప్రతి యాదవ కుటుంబానికీ ఈ స్కీం అందేలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గతంలో గొల్ల కురుమల సొసైటీ ఏర్పాటు చేయడమే పెద్ద ప్రహసనంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అందులో సమూల మార్పులు చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ చట్ట సవరణ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ అర్హులుగా గుర్తించారు. దీంతో పెద్ద సంఖ్యలో సభ్యులు నమోదయ్యారు. వీరిని గ్రూప్-ఏ, గ్రూప్-బీ గా విభజించి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
పెరిగిన యూనిట్ ధర
గతంలో యూనిట్ ధర రూ. 1.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు మార్కెట్లో గొర్రెలు లభించక పోవడంతో దీనిని సమీక్షించి యూనిట్ ధరను రూ. 1.75లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం యూనిట్ కాస్ట్లో 75 శాతం సబ్సిడీగా మరో 25 శాతం లబ్ధిదారుడి వాటాగా నిర్ణయించారు. పెరిగిన ధరలో 1,31,250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుండగా లబ్ధిదారుడు రూ. 43,750 తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును అందజేస్తున్నారు.
ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ
ఈ పథకం అమలులో అక్కడక్కడా వచ్చిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మరింత పకడ్బందీగా ప్రణాళిక రూపొందించింది. ఎక్కడా చిన్న తప్పుకు ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా ఓ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా పర్యవేక్షించనున్నారు. గొర్రెల సంఖ్య నుంచి మొదలుకొని వాటి నమోదు, లైవ్ లొకేషన్, ఫొటో ఫీచర్ లాంటి వన్నీ ఇందులో పొందుపర్చారు. గొర్రెల కొనుగోలు సమయంలో, వాహనాల్లో ఎక్కించే సమయంలో, అన్లోడ్ చేసే సమయంలో, చివరకు లబ్ధిదారుడికి గొర్రెలను అందజేసే సమయంలోనూ లైవ్ ఫొటోలతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రతి దశలోనూ లైవ్ ఫొటోలతో పాటు రవాణా వాహనాలకు జీపీఎస్ సిస్టంను సెంట్రల్ సర్వర్కు అనుసంధానం చేసి పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా రెండో విడుత పంపిణీని సిద్ధమయ్యారు.
తొలి విడుతలో 26159 యూనిట్లు పంపిణీ.
2017-18 నుంచి మొదలైన ఈ పథకంలో ఇప్పటికే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 26,159 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను ప్రభుత్వం అందజేసింది. మలి విడుతగా మిగిలిన వాళ్లకు ఇవ్వాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభించగా మన జిల్లాలోనూ త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలి విడుతగా జిల్లా వ్యాప్తంగా 39,979 మందికి ప్రభుత్వం గొర్రెలను అందజేయనుంది. జిల్లా వ్యాప్తంగా 491 గ్రామాల్లో యాదవులు ఉండగా ఆయా గ్రామాల్లో సొసైటీలను ఏర్పాటు చేసిన అధికారులు 18 ఏండ్లు నిండిన యాదవులతో కలిపి మొత్తంగా 66,132 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో మొదటి దఫాలో 26,159 మందికి 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలును ఇవ్వగా ఈ సారి 39 979 మందికి ఇవ్వనున్నారు. 2017 జూన్ 21న ఈ పథకం జిల్లాలోని జీకే అన్నారంలో ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలోనూ రెండో విడుతలో 17642 మంది జాబితా సిద్ధంగా ఉంది. వీరికి ప్రస్తుతం గొర్రెల యూనిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడుతలో ఇక్కడ మొత్తం 17042 మందికి సబ్సిడీ గొర్రెలను అందజేశారు. మరో 85 మందికి పెండింగ్లో ఉండగా వీరికి కూడా ఈ విడుతలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ రెండో విడుత పంపిణీపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే వారి వద్ద ఉన్న లబ్ధిదారుల జాబితా ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా సబ్సిడీ గొర్రెలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తొలి దఫాలో తీసుకున్న గొర్రెల సంత ఇప్పటికే ఎనిమిది రెట్లు పెరగగా తమ ఆర్థికపరిస్థితి మెరుగు పడిందని యాదవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీపై దృష్టి సారించాం. రెండో విడుత లబ్ధిదారుల జాబితా ప్రకారం గొర్రెల కొనుగోలు చేశాం. ఈ దఫాలో ప్రభుత్వం మరింత పకడ్బందీగా నిబంధనలు విధించింది. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా అన్ని దశల్లోనూ ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ ఉంటుంది.