ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల, జూలై 21 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రోళ్లవారిగూడెంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా చిన్న గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామానికీ వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటింటికీ భగీరథ నీరు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు, రైతు వేదికలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలల అభివృద్ధి, లింకురోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోరినన్ని నిధులిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి రూ.2.72కోట్లతో బీటీ రోడ్డు సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం నేరేడుచర్లలోని ఎన్ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న సమీకృత మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, సర్పంచ్ హస్సేన్, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్, ఎంపీటీసీ లింగయ్య, ఎంపీఓ విజయకుమారి, పంచాయతీరాజ్ ఏఈ మధు, నాయకులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణానికి అనుమతివ్వాలని వినతి
మఠంపల్లి/హుజూర్నగర్ : మండలంలోని వరదాపురం గ్రామంలో గల అంబేద్కర్ కాలనీలో ఇండ్లు కట్టుకునేందుకు అనుమతులివ్వాలని కాలనీవాసులు బుధవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలోని దళితుల ఇండ్లను అక్రమంగా కూల్చివేశారని ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి దళితులకు న్యాయం చేస్తామని సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం అందజేసిన వారిలో మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, నాయకులు దైదా ఇమ్మాన్యుయేల్, మల్లారపు గోపి, అమరారపు పున్నయ్య, పల్లె చందర్రావు, నందిపాటి నాగరాజు, వార్డు మెంబర్ రెడపంగు జార్జి, నందిపాటి సోమయ్య, జయరాజు, వల్లపుదాసు రామయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.
బీమా చెక్కుపంపిణీ
హుజూర్నగర్ మండలం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు బైరు కనకయ్య ఇటీవల మృతి చెందగా ఆయనకు మంజూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మృతుడి భార్య హుస్సేనమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సౌజన్య, ఎంపీపీ పార్వతీకొండానాయక్, జడ్పీటీసీ జగన్నాయక్, కోలాహలం కృష్ణంరాజు, మన్నెం శ్రీనివాస్రెడ్డి, సైదులు, మల్లికార్జున్, నాగులు, శ్రీను, సోమయ్య, నరేశ్ పాల్గొన్నారు.