ప్రతిఫలం ఆశించకుండా కుటుంబం ఆలనపాలన చూసుకునే మహిళ శ్రమకూ విలువ ఉన్నదని ఎలుగెత్తిన వ్యక్తి! ఆకాశంలో సగం అని చెప్పుకొంటున్నా.. ఎవరెస్ట్ను అధిరోహిస్తున్నా మహిళలకు సైనిక దళాలలో పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడం పట్ల కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సాహసి!
నేరపూరిత రాజకీయాలనుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు చిరుదీపం వెలిగించిన మార్గదర్శి! ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రాజకీయ బేరసారాలతో ఆపదలో చిక్కుకున్న వేళ.. వాటిని చిక్కుల నుంచి గట్టెక్కించిన తీర్పరి! నిందితులపై పోలీసుల అక్రమనిర్బంధాన్ని, చిత్రహింసలను ఆక్షేపించిన న్యాయమూర్తి. వీల్లేదు.. విడాకులివ్వాల్సిందనంటూ కోర్టుకెక్కిన అనేక జంటలకు జీవితం విలువను తెలియజెప్పి.. నచ్చజెప్పి వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన మానవతావాది! అంతటి మానవీయమూర్తి.. తెలుగుతేజం.. జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ సర్వోన్నత న్యాయపీఠాన్ని శనివారం అధిరోహించనున్నారు. దాదాపు 54 ఏండ్ల తరువాత ఒక తెలుగు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరించింది. నేడు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ జస్టిస్ రమణతో నూతన సీజేఐగా ప్రమాణం చేయించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన సీజేఐగా పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ బాబ్డేకు శుక్రవారం వర్చ్యువల్గా ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆయన తీర్పులతో ప్రాణం నిలుపుకొన్న ప్రజాస్వామిక హక్కులెన్నో! స్వేచ్ఛగా తమ అభిప్రాయాల వెల్లడికి దారి చూపిన ఉత్తర్వులెన్నో! కంపెనీలు మూతపడినప్పుడు అందులో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడిన ఉదంతాలెన్నో! ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్ష్యం..
ఆయనతో అద్భుత తీర్పులు చెప్పించింది! సమాజాన్ని అధ్యయనం చేసిన ఆయన వివేకం.. విజ్ఞతతో న్యాయ పీఠానికి వన్నె తేవడమే కాకుండా.. ఆయన జీవితాన్నే ఒక పాఠంగా మలిచింది! అంతటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సర్వోన్నత న్యాయపీఠంపై ఆశీనులవడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కాక మరేమిటి!!
జస్టిస్ రమణ న్యాయమూర్తిగా ప్రజాస్వామిక హక్కులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. మానవీయమైన న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రధానమైనది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల జాబితాలు తయారుచేయాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను 2019 సెప్టెంబర్ 17న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న కేసులపై విచారణ వేగవంతం చేయాలని, ప్రధాన న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆదేశించింది. నేర రాజకీయాలు బాగా పెరిగిపోవడమే కాకుండా, ప్రజా ప్రతినిధులు (ప్రస్తుత, మాజీ) దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రత్యేక కోర్టుల హేతుబద్ధీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.
గృహిణి శ్రమకూ విలువ
ఇంటిలో గృహిణి చేసే పనికి విలువ కట్టాలని ఆయన 2021 జనవరిలో ఇచ్చిన ఒక తీర్పులో స్పష్టం చేశారు. ర్యాలయంలో భర్త చేసే పనితో ఇంటిలో గృహిణి చేసే పని ఏ మాత్రం తీసిపోదని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. వారు ఇంటిలో చేసిన సేవలకు లెక్క కట్టి చెల్లించాలని అన్నారు.
2018లో ఇచ్చిన ఒక తీర్పులో సైనిక దళాలలో మహిళలకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడం పట్ల కేంద్రాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై సుదీర్ఘ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. వాక్ స్వాతంత్య్రం, భావ స్వేచ్ఛలకు రాజ్యాంగం హామీ ఇస్తున్నదని, అందువల్ల ఇంటర్నెట్ సేవలపై సుదీర్ఘ ఆంక్షలు తగదని తీర్పునిచ్చారు. ప్రజల న్యాయబద్ధమైన వ్యక్తీకరణ, ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించడం కోసం 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు విధించకూడదని కూడా స్పష్టంచేశారు.
రాజకీయ సంక్షోభాలకు పరిష్కారం
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిని, స్పీకర్ను సంప్రదించకుండా గవర్నర్ శాసనసభ సమావేశాలను ముందుకు జరుపుతూ జారీచేసిన ఉత్తర్వును కొట్టివేశారు. ఈ విధంగా శాసనసభ ఔన్నత్యాన్ని, రాష్ర్టాల అధికారాలను కాపాడారు. 2019లో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడి, ఎమ్మెల్యేల బేరసారాలు సాగే పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే శాసనసభలో బలపరీక్ష జరపాలని జస్టిస్ రమణ తీర్పు నిచ్చారు.
కేసులను వేగంగా పరిష్కరించాలనేది ఆయన అభిప్రాయం. వివిధ గోష్ఠులలో ఆయన అనేక పత్రాలను సమర్పించారు. మహిళా సాధికారత, జ్యుడిషియల్ యాక్టివిజమ్, మహిళలకు సమన్యాయం, పర్యావరణం- సుస్థిరాభివృద్ధి, 21వ శతాబ్దంలో మానవ హక్కుల సంబంధిత సవాళ్లు, దివ్యాంగుల హక్కులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ మొదలైన అంశాలపై సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. యూకే నుంచి ఆహ్వానం అందడంతో బ్రిటన్ పర్యటించి, అక్కడి న్యాయవ్యవస్థపై అధ్యయనం చేశారు. ఆర్థికరంగ సమస్యలపై కొలంబోలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానంపై వెళ్లారు. అమెరికా వెళ్లి అక్కడి న్యాయ వ్యవస్థను అధ్యయనం చేశారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు అంతర్జాతీయ సదస్సులకు హాజరై రాజ్యాంగ, చట్టపరమైన అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించారు. జస్టిస్ ఎన్వీ రమణకు న్యాయవ్యవస్థలో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్నది. రెండు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. పలు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లలో సేవలు అందించారు. రాజ్యాంగ, అంతర్రాష్ట్ర జల చట్టాలు, క్రిమినల్, సర్వీసు అంశాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సెల్గా పనిచేశారు.
వివాహ వ్యవస్థకు దన్ను
ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఒక పిటిషన్పై విచారణ జరుపుతూ, ఎన్నికలు అయ్యేంతవరకు పదిహేను రోజులపాటు మద్యం దుకాణాలను తెరువకూడదని ఆదేశాలు జారీచేశారు.
భార్యాభర్తల వివాదాలు వచ్చినప్పుడు, వీలైనంత వరకు వివాహాన్ని కాపాడటానికే ప్రయత్నించేవారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇలాంటి కేసులు ఎక్కువగా క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలమీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి వారికి రాజీ కుదిర్చి మహిళలు, పిల్లల ప్రయోజనాలు కాపాడాలని చూసేవారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత లభించడానికి, విద్యావంతులను చేయడానికి ప్రయత్నించేవారు.
విశ్వసించినవారికి న్యాయం అందించాలి
ఆసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయాధీశులకు, న్యాయవాదులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం గల పౌరులకు న్యాయం అందించడమే లక్ష్యం కావాలని భావించేవారు. క్రిమినల్ కేసులలో నేరానికి తగిన మేరకే శిక్ష ఉండాలనేది జస్టిస్ రమణ అభిప్రాయం
బాల సాక్షులు, మరణ వాంగ్మూలాలు, మరణ శిక్షల విషయంలో జాగ్రత్తగా వివరాలు పొందేవారు. శిక్షించడం కాకుండా, సంస్కరించాలనేది ఆయన అభిమతం. అరుదైన కేసులలోనే మరణ శిక్ష విధించాలని భావిస్తారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, శిక్షణ ప్రమాణాలు పెంచేలా కృషి సాగించారు. క్రిమినల్ జస్టిస్పై మూడు రోజుల ప్రాంతీయ (దక్షిణ జోన్) న్యాయ సదస్సును హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. హైదరాబాద్లో భిన్న రంగాలకు చెందిన ప్రజానీకంతో న్యాయాధీశుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో ఇటువంటి సమ్మేళనం జరగడం అదే మొదటిసారి. ‘మహిళలపై లైంగిక దాడులు- సమస్యలు, సవాళ్లు’ అనే అంశంపై ఆ బహిరంగ వేదికపై చర్చ నిర్వహించి, అందులో వచ్చిన సూచనలను క్రిమినల్ చట్ట సవరణకు ఉద్దేశించిన జస్టిస్ వర్మ కమిషన్కు పంపించారు. న్యాయవ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలనేవారు. రాష్ట్రంలోని సబార్డినేట్ కోర్టుల్లో కంప్యూటీకరణ చేయించారు. న్యాయవ్యవస్థలో తెలుగు భాషను అమలు చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. తమ బాధలు తీర్చుకోవడానికి వచ్చిన వారికి కోర్టులలో ఏమి జరుగుతున్నదో తెలువాలని అనేవారు. ఇందుకోసం, ఏపీ జుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా అధికార భాషా సంఘంతో ఒక రోజు సదస్సు కూడా నిర్వహించారు.
రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదికే
ముస్లిం రిజర్వేషన్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో భాగంగా మెజారిటీ తీర్పుతో ఏకీభవిస్తూనే, ముస్లిం రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికపై ఉండాలని, సమాజాన్ని విభజించే కులమతాల ప్రాతిపదికగా కాదని విడిగా జస్టిస్ ఎన్వీ రమణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హోం శాఖ వ్యవహారాలు తన పరిధిలో ఉన్నప్పుడు, నిందితులపై పోలీసులు అక్రమ నిర్బంధానికి, చిత్రహింసలకు పాల్పడటాన్ని ఆక్షేపించారు. న్యాయమూర్తిగా పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. జలాశయాల పరిసరాలలో నిర్మాణాలు చేపట్టకుండా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూశారు. అడవులను పరిరక్షించేలా, అటవీ ప్రాంతాలలో కట్టడాలు చేపట్టకుండా కఠినంగా వ్యవహరించారు. రహదారుల పక్క స్థలాన్ని నిర్దేశిత లక్ష్యం కోసం ఉపయోగించకుండా, ఆక్రమించుకోవడాన్ని అరికట్టారు.
గణనీయమైన తీర్పులు
న్యాయమూర్తిగా మానవ జీవితానికి సంబంధించిన, జాతీయ ప్రాధాన్యం గల పలు అంశాలపై చెప్పుకోదగిన తీర్పులు ఇచ్చారు. కంపెనీ కోర్టు న్యాయమూర్తిగా పరిశ్రమలను కాపాడటమే కాకుండా, ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించారు. కంపెనీ మూసివేసినప్పుడు ఆర్థిక సంస్థల బాకీలు చెల్లించేలా చూశారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించారు. ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పనిచేసుకోవాలని సూచించేవారు. వివాదాలు వచ్చినప్పుడు సామాన్యుల మాదిరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గం ఎంచుకోవాలని చెప్పేవారు. యాజమాన్యం, కార్మికులు కూడా చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనేవారు. చట్టబద్ధ పాలన కోసం, సమన్యాయం కోసం కృషి చేసేవారు.
విలువ ఇంటిలో
గృహిణి చేసే పనికి విలువ కట్టాలి. కార్యాలయంలో భర్త చేసే పనికి, ఇల్లాలు చేసే పని ఏ మాత్రం తీసిపోదు. మహిళ ఇంటిలో చేసిన సేవలకూ లెక్క కట్టి చెల్లించాల్సిందే. 2021 జనవరిలో ఇచ్చిన ఒక తీర్పు.
కష్టం నుంచే బలం దేశమంతా
పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నది. కరోనా మహమ్మారితో మనం పోరాడుతున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో బలమైన చర్యలు అవసరం. కష్ట సమయం మరింత బలమైన మనుషులను తయారు చేస్తున్నది.అలాంటి బలమైన మనుషులు మంచి సమయాన్ని మళ్లీ తీసుకువస్తారు.
రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారు
మంచి వ్యక్తితత్వం ఉన్న వ్యక్తి. తెలుగువాడికి కొన్ని దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవకాశం లభించడం సంతోషం. ఇదొక మహత్తర అవకాశం. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. నాతో కలిసి డివిజన్ బెంచ్లో పనిచేశారు. ఆయనలో సత్ప్రవర్తన, మంచి చేయాలనే సంకల్పం, క్రమశిక్షణ వంటిని అప్పడే చూశాను. నిస్సందేహంగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తారని ఆశించవచ్చు. ఇందులో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు.
ఎదిగిన కొద్దీ ఒదిగిన వ్యక్తి
అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. క్రమశిక్షణతో నడిచిన వ్యక్తి. ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వని వ్యక్తి. ఎదిగేకొద్దీ ఒదిగిన వ్యక్తి. నేపథ్యం సాధారణ వ్యవసాయ కుటుంబం. న్యాయపరంగా గాని ఇతరత్రా గాని ఎలాంటి అండదండలు లేకపోయినప్పటికీ క్రమశిక్షణతో దేశ అత్యున్నత న్యాయ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి. దాదాపు 55 ఏండ్ల తర్వాత తెలుగు తేజం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం తెలుగువాడిగా న్యాయవాదులకే కాకుండా అందరికీ గర్వకారణం. ఇక్కడి హైకోర్టు నుంచి ఉన్నత స్థాయి చేరిన వ్యక్తికి మాతృ హైకోర్టులో ఘన సన్మానం చేస్తాం. న్యాయవ్యవస్థ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయని ఆశిద్దాం. తెలుగు రాష్ర్టాల కోర్టుల్లోని సమస్యల పరిష్కారం అవుతుందని భావిద్దాం.
టీంగా పనిచేశాం
ఇద్దరు అదనపు అడ్వొకేట్ జనరల్స్ 1998 ఏప్రిల్లో ఒకేసారి నియమితులయ్యాం. తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి స్థాయికి చేరడం అభినందనీయం. ఆయనకు శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా నేను ఇంకా మాట్లాడలేదు. మాట్లాడతాను. ఇద్దరం అదనపు ఏజీగా టీంగా పనిచేశాం.
మనందరికీ గర్వకారణం
స్వయం కృషితో పైకి వచ్చారు. కమిట్మెంట్తోనే ఆస్థాయికి చేరగలరు. ఉత్తరాది-దక్షిణాది మధ్య తేడాలు బాగా ఉంటాయి. ఉత్తరాది పెత్తనం ఉన్నప్పటికీ సీజేఐ అవ్వడం గర్వకారణం. తెలంగాణలో 24 జడ్జీల పోస్టులున్నాయి. ఇందులో 10 వరకూ ఖాళీగా ఉన్నాయి. రికార్డు స్థాయిలో 2.15 లక్షల పెండింగ్ కేసులున్నాయి. జడ్జీల సంఖ్య 42కి పెంచాలి. జడ్జీల పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి. ఏపీలోనూ జడ్జీల సంఖ్య పెంచాలి. ఉత్తరాది ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలంటే హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తేనే దక్షిణాది వారికి సత్వర న్యాయం అందుతుంది.
-ఏ నర్సింహారెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్
నమ్మిన దారిని వీడలేదు
సౌమ్యుడు. తోటివారికి సాయం చేసే వ్యక్తి. సీనియర్ అయినప్పటికీ అందరికీ చేదోడుగా ఉంటారు. అంకితభావంతో నిజాయితీగా పనిచేసే వారు. నమ్మినదానికి కట్టుబడిన వ్యక్తి. ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా నమ్మిన మార్గాన్ని వీడకుండా ముందుకు సాగిన వ్యక్తి. క్రమశిక్షణ, నిబద్ధతలే ఉన్నతస్థాయికి చేరేందుకు దోహదపడింది. అభినందనలు.
స్నేహానికి ప్రాణం ఇస్తారు
డిగ్రీలో సహ విద్యార్థి. ఏనాడూ క్రమశిక్షణను ఉల్లంఘించలేదు. ఎప్పుడూ పుస్తకాలు, సామాజిక అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మాకు కూడా అవే అలవాట్లు వచ్చాయి. న్యాయవాదిగా ప్రోత్సహించారు. కష్టనష్టాల్లో చేదోడువాదోడుగా నిలిచారు. తప్పు చేసిన వ్యక్తి వస్తే క్షమించే పెద్ద మనసు. దారితప్పని వ్యక్తి. నీతినియమాలకు కట్టుబడిన వ్యక్తి. ప్రమాణాలకు పెద్దపీట వేసే వ్యక్తి. స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చు. ఇంటికి వెళితే కుటుంబసభ్యుడిగా పరిగణిస్తారు. అలాగని ఆయన స్థాయిని పురోగతిని నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా ఏనాడూ లక్ష్మణరేఖను దాటే ప్రయత్నం చేయలేదు. ఇదే మా స్నేహం బలంగా ఉండేందుకు ప్రధాన కారణం.