కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. కేసుల సంఖ్య భారీగానే పెరుగుతున్నాయి. ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడంతోపాటు ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేసి జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నది. కానీ కొందరు కరోనా పరిస్థితులను చూసి భయపడుతున్నారు. మానసిక ఆందోళన, అభద్రతా భావం వంటి కారణాలతో సతమతమవుతున్నారు. బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచనలతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో కరోనా సోకిన వారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
24 గంటలూ సేవలు
కంట్రోల్ రూమ్ నిర్వహణకు జిల్లా స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. వారు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా ముగ్గురు సహాయ సిబ్బంది, ఒక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్కు రెండు నంబర్లను 6300957120, 6281492368 ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
అర్ధరాత్రి అయినా డాక్టర్ను లైన్లోకి తీసుకుంటూ.. ‘ఆందోళనగా ఉంది.. రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లాలో.. ఏమి చేయాలో తోచడం లేదు’ అంటూ చాలా మంది ఫోన్ చేస్తుండంతో వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ డాక్టర్ను గ్రూప్ కాల్ ద్వారా లైన్లోకి తీసుకొని వారికి ఉన్న అనుమానాలు, ఆందోళనలను ఫోన్లోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు సైతం ఏ సమయంలోనైనా ఫోన్కాల్స్కు స్పందిస్తూ బాధితులకు ధైర్యం చెప్తున్నారు.
ఏ అనుమానమున్నా..
‘లక్షణాలు ఉన్నాయి.. ఏమి చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి.. మందులు ఎలా వేసుకోవాలి’ ఇంకా చిన్న చిన్న అనుమానాలకు ఫోన్ చేస్తే అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సలహాలు ఇస్తున్నారు. ఆక్సిజన్ శాతం పడిపోయి ప్రమాదస్థాయిలో ఉన్న వారికి వెంటనే అంబులెన్స్ పంపిస్తున్నారు. ఇలా రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు 500 మందికిపైగా బాధితులు పలు సమస్యలు పరిష్కరించుకున్నారు. ఇక కరోనా పరీక్షలు, వ్యాక్సిన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, మందులు తదితర వివరాలకు కూడా కాల్స్ వస్తున్నాయని కంట్రోల్ సిబ్బంది చెప్తున్నారు.
మానసిక ధైర్యం చెప్తున్నాం..
రాత్రి సమయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారు ఎక్కువగా ఫోన్ చేసి సలహాలు, సూచనలు అడుగుతున్నారు. మేము డాక్టర్లను లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తున్నాం. డాక్టర్లతోపాటు మేము కూడా సలహాలిస్తూ ధైర్యం చెప్తున్నాం. బాధితుల్లో భయం పోగొట్టి చికిత్స, మందులు పొందే ఏర్పాట్లు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.